మండు వేసవిలో ‘చల్లని’ వ్యాపారం, రెండు నెలల్లో రూ. లక్ష | cool cool business in hot summer remarkable income | Sakshi
Sakshi News home page

మండు వేసవిలో ‘చల్లని’ వ్యాపారం, రెండు నెలల్లో రూ.లక్ష

May 8 2025 4:18 PM | Updated on May 8 2025 4:18 PM

cool cool business in hot summer remarkable income

చల్లని ఉపాధి తాండూరు కూడళ్లలో ప్రత్యేక దుకాణాలు 

జ్యూస్‌లు, పండ్లు, పండ్ల రసాలు తాటిముంజల విక్రయం    

సీజనల్‌ వ్యాపారం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యవసాయ, కూలీ పనులు పెద్దగా దొరకని మండు వేసవిలో ఆదాయ వనరుగా నిలుస్తోంది. పక్క జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ‘బిజీ’నెస్‌గా మారి, నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు దోహదపడుతోంది. 

తాండూరు టౌన్‌: వేసవి ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీడ పట్టున ఉంటూ ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఉక్కపోత, వేడికి తట్టుకోలేక చల్లని నీడను ఆశ్రయించడంతో పాటు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతున్నారు. ఈ క్రమంలోనే డీ హైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ తగలకుండా గొడుగుతో బయటకు వెళ్తున్నారు. ఈ సమయంలో లస్సీ, జ్యూస్, సోడా, నిమ్మరసం, కూల్‌డ్రింక్స్‌ వంటివి సేవిస్తున్నారు. తాండూరు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో జనం వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వస్తుంటారు. రోడ్డుకు ఇరువైపులా, ముఖ్య కూడళ్ల వద్ద వెలిసిన సీజనల్‌ దుకాణాలు వీరిని సేదతీరుస్తున్నాయి. 

జ్యూస్‌లతో పాటు కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, లస్సీ తాగడంతో పాటు, తాటి ముంజలను ఇష్టంగా తింటున్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏర్పాటు చేసిన దుకాణాల్లో జనాలకు అవసరమైన శీతల పానీయాలు, పండ్లు లభిస్తున్నాయి. ప్రత్యేకంగా వెలిసిన షాపుల ద్వారా పలువురికి ఉపాధి లభిస్తోంది. మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల నుంచి వచ్చిన వారు స్థానికంగా షాపులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ఇక్కడే ఉంటారు. 

తాటి ముంజలపై మక్కువ 
వేసవి కాలంలో చాలా మంది తాటి ముంజలు తినేందుకు మక్కువ చూపుతారు. తాండూరు ప్రాంతంలో తాటి చెట్లు పెద్దగా లేకపోవడంతో చుట్టు పక్కల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. డజనుకు రూ.వంద చొప్పున తాజా ముంజలను అమ్ముతున్నారు. రెండు నెలల పాటు ఇదే తమకు బువ్వ పెడుతుందని గ్రామీణ చిరు వ్యాపారులు చెబుతున్నారు.   

ఏళ్లుగా ఇదే వ్యాపారం 
కొన్నేళ్లుగా వేసవిలో తాండూరుకు వచ్చి పుచ్చకాయలు విక్రయిస్తున్నాం. మహబూబ్‌నగర్‌ ప్రాంతం నుంచి ట్రాన్స్‌పోర్టులో తెస్తాం. నిత్యం సుమారు క్వింటాలు నుంచి క్వింటాలున్నర వరకు అమ్ముతాం. ఎండలు తగ్గగానే స్వస్థలానికి వెళ్లిపోతాం.   – హైమద్, మహబూబ్‌నగర్‌ జిల్లా  

రాయలసీమ నుంచి వచ్చాం  మాది రాయలసీమ ప్రాంతం. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు పలు రకాల ఫ్రూట్‌ జ్యూస్‌లు అమ్ముతుంటాం. ఒక్కో గ్లాసుకు జ్యూస్‌ను బట్టి రూ.10 నుంచి రూ.40 వరకు విక్రయిస్తాం. వేసవి సీజన్‌లో ఇదే మాకు ప్రధాన ఉపాధి. రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు సంపాదిస్తాం.   – రషీద్, ఫ్రూట్‌ జ్యూస్‌ విక్రయదారు 

రెండు నెలల్లో రూ.లక్ష..  
వేసవిలో చాలా మంది తాటి ముంజలను భలే ఇష్టంగా తింటారు. వీటి సీజన్‌ తక్కువ కాలం ఉంటుంది. దీంతో ఎగబడి కొంటుంటారు. దూర ప్రాంతాల నుంచి ఆటోల్లో తీసుకువచ్చి విక్రయిస్తాం. రోజంతా ఎండలోనే పని, రెండు నెలల్లో రూ.లక్ష వరకు సంపాదిస్తాం.   – హన్మంతు, చిన్నవార్వల్‌ 

సీమ నుంచి వచ్చి  
రాయలసీమ ప్రాంతానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఏటావేసవి సీజన్‌ ప్రారంభం కాగానే తాండూరుకు చేరుకుంటాయి. పలు అడ్డాల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకుని ప్రూట్స్‌ సలాడ్, బాదంపాలు, నిమ్మరసం వంటి జ్యూస్‌లను విక్రయిస్తారు. నిత్యం రూ.3 వేల నుంచి రూ.4 వేల వ్యాపారంజరుగుతుందని చెబుతున్నారు. జూన్‌ వరకు ఇక్కడే ఉండి ఐదు నెలల పాటు వ్యాపారం చేస్తారు. సీజన్‌ ముగిశాక తిరిగి తమ సొంతూళ్లకు వెళ్తారు. ఖర్చులు పోనూ నెలకు కనీసం రూ.30 వేల వరకు సంపాదిస్తామంటున్నారు.  
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement