పాలకొల్లు సెంట్రల్: అప్పట్లో ప్రజల్లో చైతన్యం రప్పించడానికి నాటక రంగం ఎంతో ముఖ్య భూమిక పోషించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం పట్టణంలో పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన జాతీయ స్థాయి నాటిక పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు అంటేనే కళాకారులకు నిలయమన్నారు. నాటిక పోటీల నేటి యువతరానికి నాటక రంగానికి సంబంధించిన విశిష్టతను అందించేలా కళాపరిషత్ సభ్యులు ప్రోత్సహించాలన్నారు. త్వరలో పట్టణంలో బొండా వెంకట్రాజుగుప్త కళాక్షేత్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తానని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ను మంత్రి చేతులుమీదుగా ఘనంగా సత్కరించారు. గత 17 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటిక పోటీలు నిర్వహిస్తున్న పాలకొల్లు కళాపరిషత్ సభ్యులను అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, కర్నేన గౌరునాయుడు, పెచ్చెట్టి బాబు, జివి, మేడికొండ శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, కొల్లి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అగ్నిసాక్షి నాటిక దృశ్యం
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి గుండా లక్ష్మీ రత్నావతి కళావేదికపై చిలకమర్తి కళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీల ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యత, ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతాయనే కథనంతో చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం– విశాఖ వారి అగ్నిసాక్షి నాటక ప్రదర్శన సాగింది. రచన మాడభూషి దివాకర్ బాబు, దర్శకత్వం పి.బాలాజీ నాయక్ వహించారు. క్రాంతి ఆర్ట్స్ థియేటర్– నెల్లూరు వారి ఫోటో నాటిక ద్వితీయ ప్రదర్శనగా సాగింది. రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు, దర్శకత్వం తంబు సురేష్ బాబు వహించారు. ఎస్వీ రంగారావు కళా స్రవంతి –కాకినాడ వారి ఆచమనం నాటిక తృతీయ ప్రదర్శనగా సాగింది. రచన దర్శకత్వం పి వెంకన్న బాబు వహించారు.


