మాజీ ఎమ్మెల్యే బాలరాజు
కొయ్యలగూడెం: దగా ప్రభుత్వాల పాలనలో కోట్లు నేతలకి, పాట్లు ప్రజలకి అనే రీతిలో ఉందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం బోడిగూడెం, మంగపతిదేవిపేట పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను ఆయన వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సోమరాజుతో కలిసి పరిశీలించారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేస్తే వేలాది కోట్ల రూపాయలను కాంట్రాక్టుల రూపంలో చేజిక్కించుకునేందుకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారన్నారు. దాదాపు 1500 ఎకరాల వ్యవసాయ భూములు నేవీ ఆయుధ డిపో కర్మాగారానికి ఇవ్వడం వల్ల రెండువేల మందికి పైగా రైతులు, పరోక్షంగా ఇరవై వేల మందికి జీవనోపాధి పోతుందన్నారు. సుమారు రెండు నెలలుగా రైతాంగం చేస్తున్న ఆందోళనకు వారికి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు ప్రభుత్వం స్పష్టమైన జవాబు ఇవ్వకపోవడం అనుమానాలకు తావునిస్తోందన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు గ్రామాలలో దళారులను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద రైతుల భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆయుధ డిపో నిర్మాణానికి 90 శాతం రైతులు అనుకూలంగా ఉన్నారని అంటుంటే కనీసం 9 శాతం మంది కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరనేది వైఎస్సార్సీపీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం అయింది అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి గంటా శ్రీనివాస్, సర్పంచ్ కడకట్ల గడ్డియ్య తదితరులు పాల్గొన్నారు.


