బుట్టాయగూడెం: అడవుల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం జీసీసీ అధికారులు, సేల్స్మెన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు సేకరించే తేనె, చింతపండు, కరక్కాయ, కొండచీపుళ్లు, ఇప్పపువ్వు వంటి 100కు పైగా చిన్నతరహా అటవీ ఉత్పత్తులు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ మద్దతు ధర కల్పించి గిరిజన ఉత్పత్తులపైనే ఆధారపడిన గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. దళారుల చేతుల్లో మోసపోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడిఏ పరిధిలోని గ్రామాల్లో గిరిజనులు తయారు చేసే ఉత్పత్తుల వివరాలు, వారి పేర్లు సేకరించాలని సూచించారు. అలాగే గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి ఉత్పత్తులకు సంబంధించిన డబ్బులను నేరుగా వారి ఖాతాలోనే జమ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


