ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 24 నుంచి రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఏలూరులోని సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సార్వభౌమాధిపత్యంపై దాడులు చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు పూర్తిగా సహకరించడానికి తప్పు బట్టారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 22 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు ప్రయోజనం శూన్యమన్నారు. పోలీస్ శాఖ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాని నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వంట గ్యాస్ ధరలు రూ.60 నుంచి రూ.116లు పెరిగితే వాటిని నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మహిళలను, పిల్లలను యంత్రాలుగా భావించి రాయితీలు ప్రకటించడం దారుణం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన రూ.32 వేల కోట్లు విడుదల చేయించుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి సరైంది కాదన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు.


