సూర్యఘర్ పథకంపై కలెక్టర్ సమీక్ష
ఏలూరు(మెట్రో): ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రగతిని మండలాల వారీగా సమీక్షించారు. కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడానికి భారీ సబ్సిడీ ఇస్తుందన్నారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా అదనపు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందవచ్చని అన్నారు. సమావేశంలో విద్యుత్తు శాఖ ఎస్ఈ పి.సాల్మన్ రాజు, డిప్యూటీ ఈఈ కమర్షియల్ ఏ.రమాదేవి, జిల్లా నెడ్ క్యాఫ్ అభివృద్ధి అధికారి యు.హరీష్ తదితరులు పాల్గొన్నారు.
వెరిఫికేషన్ 65 శాతం పూర్తి
జిల్లాలో పీ–4 కార్యక్రమం ద్వారా 65 శాతం బంగారు కుటుంబాలను వెరిఫికేషన్ చేశామని కలెక్టరు కె.వెట్రిసెల్వి, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి పీయుష్ కుమార్కు వివరించారు. బుధవారం అమరావతి నుంచి పియూస్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేటు నుంచి కలెక్టరు కె.వెట్రిసెల్వి, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.


