గ్యాస్ లీకేజీ ప్రమాదంలో.. ఒకరు మృతి
ఉండి: స్థానిక చిక్కాల వీరన్న నగర్లో ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం జరిగిన గ్యాస్ లీకేజీ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిలో ఒగ్గు సుబ్బాయమ్మ (65) మృతి చెందినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. అలాగే ఆమె కోడలు మాసాబత్తుల లక్ష్మి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ డెవరీబోయ్, లక్ష్మి వియ్యపురాలు జయ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీకవుతుందని మాసాబత్తుల లక్ష్మి ఏజెన్సీకు ఫోన్ చేసి చెప్పగా డెలివరీ బోయ్ వచ్చి తనిఖీ చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు విజయవాడలో చికిత్స పొందుతుండగా బుధవారం సుబ్బాయమ్మ మృతి చెందింది.
ఆకివీడు: సైక్లిస్టును లారీ ఢీకొట్టిన ఘటనలో లారీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపిన వివరాలు ఇవి. స్థానిక సంతపేట నుంచి సుమాల తవిటినాయుడు అనే వ్యక్తి కాన్వెంటులో చదువుతున్న తన మనవడి కోసం 2020 జనవరి 27వ తేదీన క్యారియర్ తీసుకుని సైకిల్పై వెళుతుండగా యూనియన్ బ్యాంక్ వద్దకు వచ్చేసరికి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అప్పటి ఎస్సై వీఎస్వీ.భద్రరావు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి లారీ డ్రైవర్ వేముల శ్రీనివాసరావుకు ఒక ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానాను విధిస్తూ భీమవరం సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, సెకండ్ అడిషనల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో సాక్షులను హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు హాజరుపరరచగా ఏపీపీ కె.సుజాత వాదనలు వినిపించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.


