ఎస్పీ రావు సేవలు చిరస్మరణీయం
దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ఇన్కం ట్యాక్స్ కమిషనర్ ఎస్పీ రావు అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. శనివారం కొవ్వలి అంబేడ్కర్ పార్కులో ఎస్పీ రావు 25 వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మోషేన్రాజు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు హాజరై ఎస్పీ రావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్రాజు మాట్లాడుతూ ఎస్పీ రావు వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి.. అందరూ అభివృద్ధి చెందాలనే ఆయన ఆశయం మహోన్నతం అన్నారు. కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధిగా ఉన్న 150 ఎకరాల సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, దళితుల జీవనోపాధికి ఎస్పీ రావు సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దశాబ్దాల కిందట కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధి కోసం 150 ఎకరాల భూమిని కల్పించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు తనయుడు సాయి కార్తిక్ మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ రూ.25 లక్షలతో నిర్మించనున్న అంబేడ్కర్ మల్టీపర్పస్ హాల్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. కొవ్వలి అభివృద్ధికి తమ కుటుంబం కట్టుబడి ఉందన్నారు. ఎస్పీ రావు జీవిత చరిత్రపై రాసిన పుస్తకం, క్యాలెండర్ను మోషేన్రాజు ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊదరగొండ చంద్రమౌళి, వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎంఆర్ ప్రభాకర్, జార్ఖండ్ మాజీ చీఫ్ సెక్రటరీ కె.విద్యాసాగర్, వైజాగ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాటి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ గొల్ల నాగరాజు, వెఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గొల్ల కిరణ్, సర్పంచ్లు ఇంటేటి మధులత, మొండెం సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మండలి చైర్మన్ మోషేన్రాజు


