రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి
ఏలూరు(మెట్రో): రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా జాతీయ రహదారి వెంట నిఘా పెట్టాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని, పాఠశాల, కళాశాల స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. రహదారి భద్రతా సమావేశాలు ప్రతీ నెల నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి వెంట గ్రామ సరిహద్దు ప్రాంతాలలో వీధి దీపాలు ఉండేలా చూడాలన్నారు.
తాడేపల్లిగూడెం: తేనెటీగల వల్ల పంటల్లో పరాగసంపర్కం మెరుగుపడి, దిగుబడులు పెరుగుతాయని తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకుడు ఆర్.గంగాధర్ అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకే లో మంగళవారం ప్రారంభమైన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనెటీగల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరించారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలిగే వ్యవసాయ అనుబంధరంగం తేనెటీగల పెంపకం అన్నారు.


