రూ.28.50 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయాలి
నూజివీడు: ఆగిరిపల్లిలో అన్నదానం నిర్వహించగా మిగిలిన రూ.28.50 లక్షలను వెంటనే ఆలయ అన్నదాన ట్రస్టు ఖాతాలో జమచేయాలని మంత్రి కొలుసు పార్థసారథిని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. గతేడాది నుంచి పోరాడుతుంటే ఇప్పటికి నిర్వాహకులు మిగిలిన రూ.28.50 లక్షలను మంత్రికి అప్పగించడం ఆగిరిపల్లి ప్రజల విజయమన్నారు. నూజివీడులో ఆయన మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో రెండేళ్లు అన్నదానం నిర్వహించగా రూ.5.75 లక్షలు మిగిలితే వాటిని వెంటనే అన్నదాన ఖాతాలో జమచేశామని, 22 ఏళ్లు అన్నదానం నిర్వహిస్తే మిగిలింది రూ.28.50 లక్షలేనా అని ప్రశ్నించారు. పైగా బ్యాంకు ఖాతాలో వేస్తే వడ్డీ ఎంతో రాదని, రూపాయిన్నరకో, రెండు రూపాయల వడ్డీకో ఇచ్చారని మంత్రి చెప్పడాన్ని ప్రతాప్ అప్పారావు తీవ్రంగా ఖండించారు. ఇన్నేళ్లుగా డబ్బులు వసూలు చేస్తూ మిగిలిన డబ్బులకు లెక్కలు చెప్పకుండా దగ్గర ఉంచుకోవడం సబబేనా అని నిలదీశారు. ఆగిరిపల్లిలోని ప్రజలందరూ రూ.56 లక్షల వరకు ఉన్నాయని చెప్పుకుంటున్నారని, ఇచ్చింది మాత్రం రూ.28.50 లక్షలు మాత్రమేనన్నారు.


