పారిజాతగిరి ఈవోపై చర్యలు తీసుకోవాలి
జంగారెడ్డిగూడెం: తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తనను, ప్రభుత్వాన్ని మోసం చేసిన ప్రస్తుత గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ మాజీ చైర్మన్, ప్రస్తుత ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవాద్యక్షుడు పేరిచర్ల జగపతిరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను 2002 నుంచి 2004 వరకు గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా పనిచేశానని, ఆ కాలంలో కలగర శ్రీనివాస్ను కన్సల్టేటెడ్ జీతంతో జూనియర్ అసిస్టెంట్గా నియమించడం జరిగిందన్నారు. అయితే శ్రీనివాస్ సర్వీస్ రిజిస్టర్లో 1993లో జూనియర్ అసిస్టెంట్గా చేరినట్లు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వీసు రిజిస్టర్ తయారు చేశారన్నారు. అప్పటి నుంచి విధుల్లో కొనసాగుతూ సీనియర్ అసిస్టెంట్గా, 2018లో కార్యనిర్వహణాధికారిగా ప్రమోషన్లు పొందాడన్నారు. 1993లో దేవస్థానానికి ఈవోగా ఏవీవీ రాఘువులు విధులు నిర్వహించారని, సదరు కాలంలో వేరే వ్యక్తులు ఇద్దరు అసిస్టెంట్లుగా పనిచేశారని, ఆ కాలంలో కలగర శ్రీనివాస్ విధులు నిర్వహించలేదన్నారు. అలాగే 1993లో కలగర శ్రీనివాస్ చేరి ఉంటే, అప్పటి ఈవో రాఘవులు సంతకం రిజిస్టర్లో ఉండాలి కాని, తన సంతకం ఉండటం ఖచ్చితంగా రిజిస్టర్ను ఫోర్జరీ చేశారన్నారు. కావున దీనిపై తన సమక్షంలో విచారణ నిర్వహించి, తనను, ప్రభుత్వాన్ని మోసం చేసిన కలగర శ్రీనివాస్పై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పొందిన సొమ్మును రికవరీ చేయాలని కోరారు. ఆ మేరకు సీఎం, డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్జేడీ, డిప్యూటీ కమిషనర్, విజిలెన్స్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


