త్వరలోనే గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు
● రాష్ట్రంలో 56 కిలోమీటర్ల మేర నిర్మాణం
● ప్రస్తుతం వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలు
టి.నరసాపురం: పచ్చని పొలాల మధ్య తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై త్వరలోనే రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైవే పనులు పూర్తి కాకపోవడంతో ముందుగా తెలంగాణ రాష్ట్రం వైరా నుంచి ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం వరకు వాహనాల రాకపోకలకు అనుమతించారు. నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా పరిధిలో 105 కిలోమీటర్లు, రాష్ట్రంలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 56 కిలోమీటర్లు మొత్తం 162 కిలోమీటర్లు ఈ రహదారి నిడివిగా ఉంది. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు వంతెన వద్ద దాని సమీపంలోని రైల్వే లైన్ వద్ద వంతెన నిర్మాణాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కోర్టు వివాదాలు కారణంగా జాప్యం జరగడంతో యర్రంపేట, కన్నాయిగూడెం సమీపంలో రెండు కిలోమీటర్ల మేర ఇంకా నిర్మాణం జరుగుతోంది. వీటి నిర్మాణాలకు ఇంకా మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు దాదాపు 120 కిలోమీటర్లు పూర్తయ్యింది. దీంతో తొలుత వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను అనుమతించడానికి సిద్ధం చేస్తున్నారు. టోల్ప్లాజాల నిర్మాణాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి.
తెలంగాణ–ఏపీని కలుపుతూ ఖమ్మం–దేవరపల్లి మధ్య 162 కిలోమీట్ల మేర రూ.4054 కోట్లతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను ఐదు ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గనుంది. సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లకుండా ఖమ్మం మీదుగా ప్రయాణిస్తే గంటన్నరలోనే ఖమ్మం నుంచి రాజమండ్రి చేరుకోవచ్చు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. వాహనాలు ఎక్కడ అంటే అక్కడ హైవేపై ఎక్కేందుకు వీలుండదు. పశువులు, జంతువులు రాకుండా హైవే పక్కన పూర్తిస్థాయిలో ఇనుప కంచెతో నిర్మిస్తున్నారు. టూ వీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లను కూడా హైవేపై అనుమతించరు. కార్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకే అనుమతి ఉంటుంది. హైవేపై ఎంట్రి, ఎగ్జిట్ వద్దే టోల్ ప్లాజాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైవేలో ఎక్కడ ప్రవేశించాలో, ఎక్కడ బయటకు వెళ్లారో గుర్తించి దాని ప్రకారమే ఫాస్ట్ట్యాగ్ ద్వారా బ్యాలెన్స్ కట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల డ్రైవర్లు, ప్రయాణీకులు రెస్ట్ తీసుకునేందుకు వసతులను సమకూర్చుతున్నారు. ఈ రహదారిలో డొంక దారులు, అంతర్గత రహదారుల వద్ద అండర్పాస్లు, సాగు నీటి కాలువల వద్ద అండర్ బ్రిడ్జిలు మొత్తం 124 నిర్మించారు.
ఏలూరు జిల్లాలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే
త్వరలోనే గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు


