పోస్టుమార్టం అడ్డుకుని నిరసన
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సీనియర్ టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆత్మహత్యకు కారణమైనవారిపై కేసు నమోదు చేసి సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ముప్పిడి సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బయ్యారపు రాజేశ్వరరావు మాట్లాడుతూ సుధాకర్ను మానసిక వేదనకు గురిచేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోస్టుమార్టం జరగనివ్వబోమని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ స్లీవ జోజి, డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐలు ఎంవీ సుభాష్, టి.క్రాంతికుమార్లు ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు, మృతుడి కుటుంబసభ్యులు.. సుధాకర్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్న అందరిపై కేసు నమోదు చేయడంతో పాటు, మృతుడి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి భార్య మణిబాల సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు.


