
డ్రోన్లతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నాం
జంగారెడ్డిగూడెం: ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని డ్రోన్లతో జల్లెడ పడుతున్నామని ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల జాడ కోసం కూంబింగ్లు జరిగాయని, ఈ నేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కొంతమంది మరణించారని చెప్పారు. కూంబింగ్, ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో వారు షెల్టర్ కోసం జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. గతంలో వారు ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా వినియోగించుకున్న సంఘటనలు ఉన్నాయని, ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ముందుగానే జిల్లాలో నక్సల్ వింగ్కు సంబంధించి ఒక విధానం రూపొందించనున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే తరచుగా పోలీస్స్టేషన్ల తనిఖీలు, పోలవరం ప్రాజెక్టు భద్రత పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. ఏఎన్ఎస్ పార్టీలు జిల్లా ఏజెన్సీలో కూంబింగ్ చేస్తున్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని, సంఘ విద్రోహులకు సహాయం చేసే అవకాశాలు లేవని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెంలో పోలీసింగ్ మరింత పటిష్టం చేసే దిశగా పట్టణం మొత్తం సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. పోలీసింగ్ను ప్రజలకు మరింత నమ్మకంగా మార్చే ఉద్దేశంతో దాత నవభారత్ యాజమాన్యం సహకారంతో డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ వి.కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్లు పట్టణంలో సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగి ఉండటం, జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి చెందడంతో నేరాలు జరిగే అవకాశం ఉందని, సీసీ కెమెరాల వ్యవస్థ ఉండటం వల్ల వీటిని అరికట్టే వీలుంటుందని తెలిపారు. ఒకవేళ ఘటనలు చోటుచేసుకున్నా త్వరగా వాటిని ఛేదించవచ్చని చెప్పారు. ఇటీవల కాలంలో జాబ్ ఇస్తానని మోసం చేశారంటూ కేసులు నమోదువుతున్నాయని, ఇలాంటి వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల ద్వారకాతిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకుందని, నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఏలూరుతో పాటు జంగారెడ్డిగూడెంలో కూడా పోలీస్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సబ్డివిజన్ పరిదిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం
షెల్టర్ కోసం జిల్లాలోకొచ్చే అవకాశం
ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
జాగ్రత్తగా ఉండాలి
ఎస్పీ కేపీఎస్ కిషోర్ వెల్లడి