
వారణాసిలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు
కాళ్ల: మండలంలోని వేంపాడు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వీమల్లు గంగారావు(75), అప్పాయమ్మ(70)వారణాసిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లిన వారు అక్కడే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనిపై వారణాసి పోలీసులు భీమవరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కాళ్ల పోలీసులు మృతుల బంధువులకు శుక్రవారం సమాచారం అందించారు.
బంగారం వ్యాపారి ఆత్మహత్య
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంకు చెందిన బంగారం వ్యాపారి నారాయణ అప్పారావు(48) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పారావు గతంలో తాడేపల్లిగూడెంలో బంగారం వ్యాపారం చేస్తుండేవాడు. అప్పులపాలడంతో ఏడాది క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. బంధువులు ఒత్తిడి చేయడంతో తిరిగి తాడేపల్లిగూడెం వచ్చి వ్యాపారం మొదలు పెట్టాడు. ఇటీవల అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో భరించలేక రెండు రోజుల క్రితం ఇంట్లోవారికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఈనెల 20న రాజమండ్రి గోదావరి గట్టు వద్ద అప్పారావు మృతదేహం లభించింది.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆకివీడు: స్థానిక సిద్ధాపురం రైల్వే గేటు సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా సెల్ఫోన్ మరమ్మతులు చేసే షేక్ నజీర్(35) తెల్లవారుజామున వాకింగ్ నిమిత్తం బయటకు వచ్చి రైల్వే ప్లాట్ఫారంపై వాకింగ్ చేసి, అనంతరం సిద్ధాపురం రైల్వే గేటు వద్ద నుంచి కొంత దూరం రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతన్ని వెనక నుంచి రైలు వచ్చి ఢీకొట్టింది. అతనికి వినికిడి లోపం ఉండటంతో రైలు శబ్దం తెలియలేదని తెలిసింది. ఆర్పీఎఫ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య
ఆకివీడు: స్థానిక సీపీఎం ఆఫీస్ రోడ్డులో నివశిస్తున్న బెజ్జవరపు శాంతి (25) శుక్రవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఆమె పెద్దమ్మ బెజ్జవరపు లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ హెచ్.నాగరాజు వివరాలు వెల్లడిస్తూ.. ఎంబీఏ చదివిన శాంతి తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్దమ్మ వద్దే ఉంటుంది. డ్వాక్రా యానిమేటర్గా పనిచేస్తున్న లక్ష్మి ఉదయం ఇంటి వద్ద పనిముగించుకుని డ్వాక్రా పని నిమిత్తం ఆఫీసుకువెళ్లి తిరిగి వచ్చేసరికి ఫ్యాన్కు వేలాడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ మండలానికి చెందిన విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై ఏలూరు రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఏలూరు మండలం ప్రత్తికోళ్ళలంక ప్రాంతానికి చెందిన ఘంటసాల వెంకట శ్రీనివాస్ మండలానికి చెందిన బాలికతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. బాలికను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఈనెల 18న బాలికను తనతో తీసుకెళ్లి యువకుడి బంధువు ఇంట్లో ఉంచాడు. 19న రాత్రి వేళ బాలిక తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు శుక్రవారం రూరల్ ఎస్ఐ సీహెచ్కే దుర్గాప్రసాద్ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వారణాసిలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు