గంజాయి రవాణాలో నలుగురి అరెస్ట్
దేవీపట్నం: గంజాయిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు దేవీపట్నం ఎస్సై షరీఫ్ తెలిపారు. శుక్రవారం ఉద యం పోతవరం సమీపంలో వాహన తనిఖీ లు చేస్తుండగా, పాత దండంగి గ్రామం నుంచి ఇందుకూరుపేట వైపునకు రెండు బైక్లపై ప్లాస్టిక్ సంచులలో 30 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న నలుగురిని అదుపులో తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుల్లో కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపాలేనికి చెందిన పంపన కృష్ణబాబు, ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామానికి చెందిన గెద్దాడ మణికంఠ, కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గదుర్రు గ్రామానికి చెందిన గుబ్బల ఈశ్వర్రామ్తో పాటు మరో బాలుడు ఉన్నాడు. వీరిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు.
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
అమలాపురం టౌన్: స్థానిక గోల్డ్ మార్కెట్ వీధిలోని డీలక్స్ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టణ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సీఐ పి.వీరబాబు కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరుకి చెందిన 8 మంది విటులతో పాటు ఓ మహిళను అమలాపురం తీసుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు సీఐ వీరబాబు ఆధ్వర్యంలో ఎస్సైలు ఎన్ఆర్ కిషోర్బాబు, టి.శ్రీనివాస్, కేఎం జోషి, పోలీసు సిబ్బంది ఆ లాడ్జిపై మెరుపు దాడి చేశారు. ఇందులో వ్యభిచార ముఠా నిర్వాహకుడు అయినవిల్లి మండలం రావిగుంట చెరువు గ్రామానికి చెందిన గెద్దాడ రాంబాబు, అతని సహాయకుడు ఈదరపల్లికి చెందిన కేసనకుర్తి నాగేశ్వరరావుతో పాటు 8 మంది విటులు, ఓ మహిళను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4 వేలను స్వాధీనం చేసుకున్నారు. డీలక్స్ లాడ్జి యజమాని సంతోష్ పరారీలో ఉన్నారని ఎస్సై కిషోర్బాబు తెలిపారు.


