
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవు
మాజీ హోం మంత్రి తానేటి వనిత
దేవరపల్లి: కూటమి ప్రభుత్వంలో మహిహిళలకు రక్షణ కరవైందని రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత విమర్శించారు. నల్లజర్లలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కుప్పం సంఘటనలో మహిళపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు అమానుషంగా ప్రవర్తించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని నారాయణపురంలో ఒక మహిళను నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందనే విషయం కుప్పం ఘటన రుజువు చేస్తోందన్నారు. భర్త చేసిన అప్పులకు భార్యను అమానుషంగా హింసించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఏన్డీఏ ప్రభుత్వం చేతకాని తనం కారణంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాటి మహిళకు జరిగిన అన్యాయంపై హోం మంత్రి అనిత స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడులు ఎక్కువయ్యాయని అన్నారు.
టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని అన్నారు. కుప్పం ఘటనపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, మహిళలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. రోజూ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్లాలంటే మహిళలు వణికిపోతున్నారని ఆమె అన్నారు. హత్యాచారాలకు, హత్యలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఎక్కడా పరిహారం అందించలేదన్నారు. నల్లజర్ల మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహమణ్యం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.