
సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి
కోటికేశవరంలో విషాదం
కోరుకొండ: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం, సీతపల్లివాగులో స్నానానికి దిగి కోరుకొండ మండలం కోటికేశవరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్టు సభ్యులు 15 మంది బుధవారం వాగులోకి స్నానాలకు దిగారు. వారిలో పీతల రాకేష్ (25), గుమ్మడి హర్ష (25) వాగు ప్రవాహ వేగానికి కాలు జారి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో వాగులోని రాళ్లకు వారు బలంగా ఢీకొని మృతి చెందారు. వీరిలో రాకేష్ చిన్న కిళ్లీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన అతడు మైదానంలో కట్ కొడితే ప్రత్యర్థి జట్టు సభ్యులు అడ్డుకోలేరని మంచి పేరుంది. కాగా గుమ్మడి హర్ష తల్లి కవిత సహకారంతో చిరు వ్యాపారం చేస్తున్నాడు. గ్రామ సర్పంచ్ ముడే సింధూ దివ్య, ఆమె భర్త ముడే కామేష్ ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలకు పంచనామా తదితర కార్యకలాపాలు నిర్వహించారు.
ఇసుక తవ్వుతున్న
ఏడు పడవల సీజ్
తనిఖీల్లో జిల్లా మైనింగ్ ఏడీ
ఫణిభూషణ్ రెడ్డి
తాళ్లపూడి: స్థానిక డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న ఏడు పడవలను అధికారులు బుధవారం సీజ్ చేశారు. జిల్లా మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, టాస్క్ఫోర్స్ ఎస్సై ఆంజనేయులు తదితరులు సాధారణ తనిఖీల్లో భాగంగా బోట్స్మన్ సొసైటీ సభ్యులు గోదావరిలో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న ఏడు పడవలను సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం ఉందని వారు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేసినట్టు ఆయన తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ పడవలను సీజ్ చేశామని తెలిపారు. కాగా ఇసుక తవ్వకాలు చేపట్టిన పడవలు ఎవరివన్న విషయమై సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు.

సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి

సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి

సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి

సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి