
సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బుధవారం ఇద్దరు ఖైదీలు విడుదలయ్యారు. ఆ వివరాలను సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఖైదీలు విడుదల కాగా వారిలో రాజమహేంద్రవరం సెంట్రల్ నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. వారిలో కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన కోనేటి సత్తిబాబు, గజ్జవరపు మురళీకృష్ణ ఉన్నారు. వీరు హత్య కేసులో జైలుకి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 17 నాటికి అర్హత కలిగిన జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇద్దరు ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం ఇచ్చి విడుదల చేశారు.
బాధితురాలికి న్యాయం చేస్తాం
రాజమహేంద్రవరం రూరల్: పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన బాధితురాలికి అన్ని విధాలా న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక మహిళ తన కుమార్తెను పులవర్తి సత్యదేవ్ తన కుమార్తెను ప్రేమించి మోసం చేశాడని ఓ మహిళ కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళాభివృద్ధి, సంక్షేమశాఖ, వన్స్టాప్ సెంటర్ విచారణ జరిపింది. బొమ్మూరు పోలీస్స్టేషన్లో పలుమార్లు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని, తమకు పదిరోజులు గడువు కావాలని కోరగా, బొమ్మూరు ఇన్స్పెక్టర్ వారం రోజులు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. బాధితురాలిని సత్యదేవ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈనెల 13న అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని, ప్రస్తుతం అతడు రిమాండ్పై సెంట్రల్ జైల్లో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారన్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉంచారన్నారు.