
మరిడమ్మ జాతరకు పటిష్ట భద్రత
కాకినాడ ఇన్చార్జి డీఎస్పీ శ్రీహరిరాజు
కరప: ఈనెల 25వ తేదీ నుంచి 40 రోజుల పాటు జరిగే మరిడమ్మ జాతర మహోత్సవంలో భక్తులకు అసౌక్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ, కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తునకు కరప ఎస్ఐ టి.సునీతతో చర్చించేందుకు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురంలో అమ్మవారి దర్శనానికి ఆది, మంగళ, గురువారాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో క్యూలైన్లు, వివిధ శాఖల సమన్వయంపై ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.
బాలిక అదృశ్యంపై దర్యాప్తు
బాలిక అదృశ్యం కేసుపై ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు, బంధువులు డీఎస్పీని కలసి తమగోడు వినిపించారు. బాలికను కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్న యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. కిడ్నాప్ కేసుతో పాటు, పోక్సో కేసు పెట్టాల్సి ఉంటుందని, ఎక్కడున్నా వెంటనే సమాచారం చెప్పాలని యువకుడి తండ్రికి డీఎస్పీ సూచించారు. ఆర్డీఓ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. బాలిక అదృశ్యానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, బాలిక వివరాల ముఖ్యమైన నగరాల్లోని పోలీసులకు పంపినట్టు ఆయన తెలిపారు. అనంతరం కరపలోని పురాతన శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. అర్చకులు విలపర్తి శ్రీనివాస్, విలపర్తి సత్యకృష్ణ, పెద్దింటి గోపాలకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆశీర్వచనం ఇచ్చారు.