పైసలిస్తేనే పోస్టింగ్‌! | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే పోస్టింగ్‌!

Jun 19 2025 7:39 AM | Updated on Jun 19 2025 7:39 AM

పైసలి

పైసలిస్తేనే పోస్టింగ్‌!

రీ వెరిఫికేషన్‌ పూర్తి

కాకినాడ క్రైం: సచివాలయం ఏఎన్‌ఎంల నుంచి ఎంపీహెచ్‌ఏఎఫ్‌లుగా పదోన్నతులు పొందిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ రీవెరిఫికేషన్‌ బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన 390 మందికి కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరసింహంనాయక్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ జరిగింది. తాజా ప్రక్రియలో ఇద్దరు అనర్హులను, గత ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియలో బృందాన్ని మోసగించి పదోన్నతులు పొందిన ఇద్దరు సచివాలయ ఏఎన్‌ఎంలను గుర్తించారు. ఓ ఏఎన్‌ఎం వివాహితురాలు అయినప్పటికీ అవివాహిత హోదాలో బదిలీ ప్రయోజనం పొందింది. మరో ఏఎన్‌ఎం ప్రొహిబిషన్‌ డిక్లేర్‌ కాకపోయినా బదిలీలకు హాజరై తనకు అనుకూలమైన స్థానాన్ని పొందింది. వీరద్దరిని డీఎంహెచ్‌ఓ బుధవారం నాటి రీవెరిఫికేషన్‌లో గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా 388 మందికి నియామక పత్రాలు అందజేశారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతుల కౌన్సెలింగ్‌లో అవినీతి జాతర సాగుతోంది. కొందరి అవినీతి పరాకాష్టకు చేరుకుంది. కాసులిస్తేనే పదోన్నతులు, కోరుకున్న కుర్చీలు దక్కుతున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కొక్క రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. పదోన్నతుల బాగోతంలో లక్షలు చేతులు మారాయి. సాధారణంగా పదోన్నతులు వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగులు తలా ఇంత సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇటువంటివన్నీ ఉద్యోగులు సంతృప్తి కోసం సంతోషంగా ఇస్తుంటారు. ఏ శాఖలో అయినా ఇదేమీ కొత్త కూడా కాదు. ఎటొచ్చీ పదోన్నతులకు ఒక రేటు, కోరుకున్న సీటు కోసం మరొక రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడటమే ఈ సారి సంబంఽధిత శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతులు కాకినాడ డీఎంహెచ్‌ఓ నోడల్‌ అధికారి వ్యవహరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్‌ సెక్రటరీలకు ఏఎన్‌ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్‌ జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 830 సబ్‌ సెంటర్లలో సుమారు 400 సబ్‌ సెంటర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం గత ఆదివారం ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌లో భార్య, భర్తలు, వితంతువులు, పెళ్లికాని వారు, అనారోగ్య సమస్యలున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 60 మందికి పోస్టింగులు ఇచ్చారు.

340 సబ్‌ సెంటర్లలో ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు సాధారణ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్‌ సెక్రటరీలు ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కోసం క్యూ కట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలని గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జరిపిన కౌన్సెలింగ్‌కు ముందుగానే ఆ శాఖలోని కొందరు చేతివాటం చూపించారు. ఇందుకోసం ఒక రేటు కూడా నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారు. పదోన్నతి పొందిన వారికి సీటు కేటాయించే సందర్భంలో సొమ్ములు గుంజారు. రూ.4000 నుంచి రూ.5000 వంతున వసూలు చేశారు. ఇలా రూ.20 లక్షలు వరకు ముడుపులు వసూలుచేశారు. ఇందులో వైద్య ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఒకరికి 50 శాతం, పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టే దిగువ స్థాయి వారు 20 శాతం, క్షేత్ర స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే వారికి 30 శాతం వంతున వాటాలు వేసుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చి కాకినాడలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఎపిడిమిక్‌ విభాగంలో మరొకరు, ఏఎన్‌ఎం సంఘంలో ముగ్గురు కలిసి ఈ మొత్తం అవినీతి బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టి సొమ్ము చేసుకున్నారు.

పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను బ్లాక్‌లో పెట్టి సొమ్ములు ఇచ్చిన వారికి కోరుకున్న పోస్టింగ్‌లు కట్టబేట్టేశారు. ఇలా పోస్టింగ్‌లు అందుకున్న వారి నుంచి రూ.30 వేలు వంతున వసూలు చేసి మూటగట్టేసుకున్నారు. ఇలా మరో తొమ్మిది లక్షలు ముడుపులు మెక్కి పోస్టింగ్‌లు ఇచ్చేశారనే విమర్శలు వెళ్లువెత్తాయి. ఇలా సొమ్ములు తీసుకున్న వ్యవహారంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్యుల వ్యహారాలు పర్యవేక్షించే ఒకరు, పరిపాలనా విభాగంలో మరొకరు సూత్రధారులుగా వ్యవహరించారు. ఈ లంచావతారాలతో విసుగెత్తిపోయిన ఐదుగురు ఏఎన్‌ఎంలు వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలికి చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చి కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌ రీ కౌన్సెలింగ్‌ జరపాలని ఆదేశాలు చేశారు. దీంతో బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేలకు వేలు సొమ్ములు ముట్టచెప్పి పోస్టింగులు పొందిన వారి పరిస్థితి రీ కౌన్సెలింగ్‌తో కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. సొమ్ములు ఇచ్చి కోరుకున్న పోస్టింగులు పొందిన వారి స్థానాలు తాజా కౌన్సెలింగ్‌లో మారిపోతున్నాయి. దీంతో గత ఆదివారం ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని సదరు సూత్రధారులపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది. సొమ్ములు తిరిగి ఎలా ఇవ్వగలుగుతామని, ఏదో రకంగా సర్దుబాటు చేస్తామని బుజ్జగిస్తున్నారు. రీ కౌన్సెలింగ్‌ పూర్తయ్యి చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకోనుందో వేచి చూడాల్సిందే.

వైద్య, ఆరోగ్య శాఖలో పదోన్నతుల కౌన్సెలింగ్‌

పోస్టుకో రేటు నిర్ణయం

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన

పలువురు ఏఎన్‌ఎంలు

ఆయన ఆదేశాలతో రీ కౌన్సెలింగ్‌

సొమ్ము తిరిగి ఇవ్వాలని

మెక్కిన వారిపై ఒత్తిడి

పైసలిస్తేనే పోస్టింగ్‌! 1
1/1

పైసలిస్తేనే పోస్టింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement