
చేనుకు చేప మందు
ప్రయోజనాలు ఇవే..
● ఫిష్ అమినో యాసిడ్లో నత్రజని శాతం ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు తొందరగా పెరుగుతాయి.
● స్వల్ప కాలిక పంటలైన కూరగాయలు, వరి, పప్పు దినుసులకు మొదటి 40 రోజులు చాలా కీలకమైనవి. వాటి పెరుగుదల పైన మాత్రమే దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఐదు రోజులకు ఒకసారి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే యూరియా, డీఏపీ ఎరువుల కంటే ఎక్కువ బలాన్ని పంటకు ఇస్తుంది.
● 40 రోజుల తర్వాత పది రోజులకు ఒకసారి ఇతర ద్రవాలతో కలిపి దీనిని వాడుకోవచ్చు. దీనిని వాడడం వల్ల మొక్క ఆకులు బాగా పచ్చబడటం, కొమ్మలు బాగా రావటం, కాయ సైజు బాగా పెరగడం జరుగుతుంది.
● నత్రజనితో పాటు ఇతర పోషకాలు ఉండటం వల్ల పూత, పిందె ఎక్కువ మొత్తంలో వస్తుంది.
పిఠాపురం: సాధారణంగా ఉబ్బసానికి చేప మందు వేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చేపలతో చేలకు మందు తయారు చేస్తున్నారు. దాన్నే ఫిష్ అమినో యాసిడ్ మీనామృతం అని పిలుస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలోని గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ఏడాది అధిక మొత్తంలో మీనామృతం తయారీ చేపట్టారు. రోజుకు 300 లీటర్ల మీనామృతం తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు ఈ మందును పంపిణీ చేయనున్నారు. మీనామృతం తయారీఽ విధానాన్ని ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు.
మీనామృతం
మీనామృతం తయారీకి చేపలు, బెల్లం, బొగ్గు, దేశీయ ఆవు మూత్రం అవసరమవుతుంది. ముందుగా చేపలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చేప లోపలి భాగాలను కూడా వినియోగించుకోవచ్చు. వాటిని పారవేయాల్సిన అవసరం లేదు. ముందుగా కత్తిరించిన చేపలు ఎన్ని కేజీలున్నాయో తూకం వేసి సిద్ధం చేసుకోవాలి. అంతే మొత్తంలో బెల్లాన్ని దగ్గర పెట్టుకోవాలి. బెల్లాన్ని పొడిగా దంచుకోవాలి. 200 లీటర్ల కెపాసిటీ గల డ్రమ్ములు తీసుకోవాలి. వాటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మీనామృతం కలపడానికి ఒక పెద్ద గిన్నె లేదా టబ్ అవసరం. అది పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
తయారీ విధానం
పెద్ద గిన్నె లేదా టబ్లో 10 కేజీల చేపలు, 10 కేజీల బెల్లం, 100 గ్రాముల బొగ్గు పొడి, ఒక లీటర్ ఆవు మూత్రం పోసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎన్ని కేజీల చేపలు ఉంటే అన్నిసార్లు కలుపుకొని డ్రమ్ములో వేసుకోవాలి. వీటిని కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పాత్రలు శుభ్రంగా ఉండేలా చూడాలి. తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే చేపలు ఎన్ని ఉన్నాయో అంచనా వేసుకొని అందుకు తగిన విధంగా డ్రమ్ములు సిద్ధం చేసుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
డ్రమ్ములో కలిపిన చేపలు వేసినప్పుడు 60 శాతం మాత్రమే నింపాలి. లేకపోతే రెండో రోజు పొంగిపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్ము 60 శాతం నింపిన తరువాత దానిని కప్పేందుకు సరిపడా ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ సంచితో మూతిని గట్టిగా కట్టాలి. దీన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సవ్య దిశలో ఐదు నిమిషాల పాటు కర్రతో కలుపుతూ ఉండాలి. అనంతరం కర్రను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. లేకపోతే వాటిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి, దానితో ద్రవాన్ని కలిపినప్పుడు పురుగులు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ద్రవాన్ని కలిపిన అనంతరం డ్రమ్ముకు కవర్ కట్టి వేయాలి. ఇలా 20 నుంచి 25 రోజులలో ద్రావణం తయారవుతుంది. సుమారు 20 రోజుల తర్వాత ద్రావణం నుంచి తాటి పండు వాసన వస్తుంది. అలా వాసన వస్తే ద్రావణం ఉపయోగించడానికి వీలుగా తయారైనట్లు గుర్తించాలి.
ఉపయోగించే విధానం
మొక్కలు నారుదశలో ఉన్నప్పుడు వంద లీటర్ల నీటికి 250 గ్రాముల ద్రావణం సరిపోతుంది.
చిన్న మొక్కలైతే 500 గ్రాములు, పెద్దవైతే ఒక కేజీ వరకూ వాడుకోవచ్చు. స్ప్రే చేసినప్పుడు ఫలితం తొందరగా కనిపిస్తుంది. ఎకరానికి ఐదు నుంచి పది కేజీల వరకూ ఉపయోగించుకోవాలి. ఈ ఫిష్ అమినో యాసిడ్ నీటిలో కలిపే ముందు ఒక కేజీ ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటిలో బాగా కలుపుకొని, ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ప్రకృతి వ్యవసాయంలో
చేపలతో మీనామృతం తయారీ
దుర్గాడలో ఖరీఫ్కు
సిద్ధమవుతున్న ద్రావణం

చేనుకు చేప మందు

చేనుకు చేప మందు