ఫ పాడి పశువులను జాగ్రత్తగా సంరక్షించాలి
ఫ యాజమాన్య పద్ధతులతో పశుగణాభివృద్ధి
ఆలమూరు: పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సమతుల్య పోషకాహారాన్ని అందించడం, సమీకృత దాణాను అందుబాటులో ఉంచడం, యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పశుగణం దినదినాభివృద్ధి చెందుతుంది. పశువులకు దూడలు జన్మించిన నాటి నుంచి యుక్త వయసుకు వచ్చి సంపర్కం జరిగి చూడి కట్టే వరకూ పాడి రైతులు ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు రైతులకు జిల్లా పశుసంవర్థక శాఖ డీడీ ఎల్.అనిత పలు సూచనలు చేశారు.
సకాలంలో చూడి పరీక్షలు
గేదె ఈనిన మూడు నుంచి నాలుగు నెలల లోపు చూడి కట్టించడం ద్వారా పశువు వట్టిపోయే లోపు మళ్లీ ఈతకు వచ్చి పాల దిగుబడినిస్తుంది. ఈపక్రియ వల్ల పశువు వట్టిపోయే కాలం అసాధారణంగా తగ్గుతుంది. దేశవాళీ పశువుల కంటే సంకర జాతి పశువులు త్వరితగతిన యుక్త వయసుకు రావచ్చు. అలాగే యుక్త వయసుకు రాని పశువులను మేపడం రైతుకు భారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పశువు యుక్త వయసుకు రాగానే చూడి కట్టించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని వల్ల ప్రతి పాడి పశువు ఏడాదికి ఒక దూడకు జన్మనివ్వడంసులభతర మవుతుంది.
యాజమాన్య పద్ధతులు
u పెయ్యదూడ వయసు నుంచే పోషణ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. దూడలకు ముర్రి పాలు పట్టడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా పెయ్య దూడ త్వరితగతిన యుక్త వయసుకు చేరుకుని దూడలకు జన్మిస్తుంది.
u కౌమార దశలో ఉన్న పశువులకు తప్పనిసరిగా సమతుల్య ఆహారాన్ని, ఖనిజ లవణ మిశ్రమాన్ని తగు మోతాదులో అందించాలి.
u పశువుల్లో తరచూ సంభవించే వ్యాధుల నివారణకు సకాలంలో సరైన మోతాదులో నట్టల నివారణ మందులను అందించాలి. వ్యాధి నోరోధక టీకాలను కాలానుగుణంగా సకాలంలో అందించాలి.
u పశువులకు అధిక వేడిమి, వేడి గాలుల నుంచి రక్షణ కల్పించాలి. యుక్త వయసుకు త్వరగా రాని పశువులను కొంత కాలం కోడె పశువులతో కలిపి ఉంచడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
u యాజమాన్య పద్ధతులు ఫలించక పోయినా రైతులు నిరుత్సాహ పడకుండా తమ పశువులకు పశు వైద్యుడిచే పరీక్షలు చేయించి చికిత్సను అందిస్తే సత్ఫలితాలను సాధించవచ్చు.
ఈతల మధ్య వ్యవధిని తగ్గించాలి
పశువులు తొలి ఈత తర్వాత నిర్దిష్ట సమయంలో ఈతకు ఈతకు మధ్య వ్యవధిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన దూడలతో పాటు అధిక పాల దిగుబడిని ఆశించవచ్చు. సాధారణంగా ఉత్తమ జాతి ఆవు లేదా గేదె 300 రోజుల పాటు ఏకధాటిగా పాలిస్తుంది. అనంతరం ఆ పశువు పాల ఉత్పత్తి కొంచెం మందగించి చివరకు వట్టిపోయే దశకు చేరుకుంటుంది. దీని వల్ల పాడి పశువులకు ఈత మధ్య ఎడం తగ్గించడం లాభదాయకంగా ఉంటుంది.


