ఒకవైపు మేత ధరల మంట.. మరోవైపు రొయ్యల కొనుగోలు ధరల కోత.. మధ్యలో ఆక్వా రైతు నలిగిపోతున్నాడు. రొయ్యల పెంపకానికి అవసరమైన మేత ధరను కంపెనీలు వరుసగా పెంచుతుండగా.. పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలుదారులు సిండికేటుగా మారి ధరలను తగ్గించేస్తున్నారు. పెట్టుబడులు పెంచేలా చేసి.. రాబడి తగ్గించే విధంగా కంపెనీలు చేస్తున్న పనులు ఆక్వా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి.
సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో నీలి విప్లవానికి కేరాఫ్ అడ్రస్గా మారిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు ఆ సాగు రైతులకు అప్పులు మిగుల్చుతోంది. వరుస సంక్షోభాలతో డాలర్ పంట రైతుకు గిట్టుబాటు కాని వ్యవహారంగా మారిపోయింది. ఉమ్మడి తూర్పు పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 15 వేల ఎకరాలు, కాకినాడ జిల్లాలో మరో 8 వేల ఎకరాల్లో వనామీ సాగు జరుగుతున్నట్టు అంచనా. రెండు జిల్లాల్లో తొలి, రెండో, మూడో పంటలు కలిపి ఒకే ఏడాదిలో సుమారు 50,600 ఎకరాల్లో వనామీ సాగవుతోందని అంచనా. గతంలో టైగర్ సాగు ఉన్నా మధ్యలో దాదాపు నిలిచిపోయింది. పాలీ కల్చర్ (చేప, రొయ్యలు కలిపి పెంపకం)లో భాగంగా రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల టైగర్ రొయ్యల ధరలు పెరగడంతో కొంతమంది రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు రకాల సాగుతో స్థానిక రైతులు ఏటా వందల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నారు.
మరోసారి మేత ధరల పెంపు
తాజాగా రొయ్యల మేతను ఆయా కంపెనీలు పెంచేశాయి. ఈసారి ఏకంగా వనామీ రొయ్యల మేత టన్నుకు రూ.5,700, టైగర్ మేతకు రూ.3,850 చొప్పున ధర పెంచుతూ ఆయా కంపెనీలు తమ డీలర్లకు లేఖలు రాశాయి. పెంచిన ధరలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే పెరిగిన ధరలకు మరోసారి భారం తోడైంది. గత ఆరు నెలల కాలంలో మేత ధరలు పెంచడం ఇది మూడోసారి. టన్ను మేత ధర సుమారు రూ.16 వేల వరకు పెరగ్గా.. తాజా పెంపుతో టన్ను ధర రూ.21,500కు చేరినట్టు రైతులు చెబుతున్నారు. ఆరు నెలల్లోనే మేత ధరలను మూడుసార్లు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు.
మరింత పెంచేందుకు యత్నం
అసలు కంపెనీలు టన్నుకు రూ.15 వేల వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా తొలి విడతగా రూ.5,700 పెంచినట్టు తెలుస్తోంది. తరువాత దశల వారీగా ధరలు పెంచనున్నాయనే ప్రచారం రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
చూసీచూడనట్టుగా ప్రభుత్వం తీరు..
వనామీ రొయ్యల మేత ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. ధరల పెంపుపై కోనసీమ జిల్లాకు చెందిన రైతులు పలు దఫాలుగా ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మేత కంపెనీలకు, కొనుగోలుదారుల సిండికేటుకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వారికి పరోక్షంగా అనుకూలంగా మారిందని రైతులు మండిపడుతున్నారు.
గతేడాది నుంచి వరుస కష్టాలు
ఇంత భారం మోస్తున్న తమకు పంట అమ్మకంలోనూ ఊరట లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమెరికా సుంకాల ప్రభావం, తెగుళ్లతో నష్టపోయిన రైతులకు ఈ ఏడాది యుద్ధం పేరుతో కొనుగోలుదారులు కేజీ కౌంట్కు రూ.35 నుంచి రూ.40 వరకు ధర తగ్గించారు. తరువాత ధరలు పెంచినా అది రైతుల వద్ద రొయ్యలు లేనప్పుడు మాత్రమే. అమెరికా, యూరప్కు 30 నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు ఎగుమతి అవుతున్నప్పటికీ.. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు తగ్గించడం అన్యాయమంటున్నారు. 100 కౌంట్ నుంచి 69 కౌంట్ వరకు ధరలు తగ్గించివేయడం గమనార్హం.
మరోసారి మేత దరువు
మళ్లీ రొయ్యల మేత ధరలకు రెక్కలు
వనామీ మేత టన్నుకు ఏకంగా రూ.5700 పెంపు
రెండేళ్లలో టన్నుకు రూ.16 వేలకు పైగా పెంచిన వైనం
తాజా పెంపుతో రూ.21,500కు చేరిన టన్ను మేత ధర
పెట్టుబడిలో సగం మేతకే
మేత కంపెనీల దోపిడీకి కొనుగోలుదారుల సిండికేటు తోడైందని ఆగ్రహం
ప్రభుత్వ పెద్దల మౌనం దోపిడీదార్లకు
అండగా మారిందంటూ రైతుల మండిపాటు
సాగు చేయలేని పరిస్థితి
టన్ను మేత ధరను రూ.21 వేలకు పైగా పెంచేశారు. ఎకరాకు అయ్యే పెట్టుబడిలో రూ.3 లక్షలు మేతకే అవుతోంది. కరెంటు బిల్లు, కూలి, మందులు అన్నీ కలిపితే పెట్టుబడులు భారీగా పెరిగాయి. పంట చేతికొచ్చేసరికి కౌంట్ పేరు చెప్పి కేజీకి రూ.40 కోత పెడుతున్నారు. మేత కంపెనీలు, కొనుగోలుదారులు ఇద్దరూ కలిసి మమ్మల్ని నిలువునా ముంచేస్తున్నారు.
– వినికోటి శ్రీనివాస్, వనామీ రైతు,
పటవల, తాళ్లరేవు
భారం రూ.230.76 కోట్లు
ఒక ఎకరా కల్చర్ ట్యాంకులో సుమారు రెండు లక్షల రొయ్య పిల్లలను వదులుతున్నారు. 50 కౌంట్ (కేజీకి 50 రొయ్యలు) చొప్పున దిగుబడి వస్తే పంటకు నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తోంది. అలా రావాలంటే టన్ను రొయ్యల ఉత్పత్తికి నాలుగు టన్నుల మేత చొప్పున సుమారు 16 టన్నుల మేత అవసరమవుతుందని రైతులు చెబుతున్నారు. తాజా పెంపుతో టన్నుకు రూ.5,700 అదనంగా చెల్లించాల్సి రావడంతో ఎకరాకు రూ.91,200 అదనపు భారం పడుతోంది. ఆరు నెలల్లో మొత్తం మేత ధర పెరుగుదల ప్రభావాన్ని లెక్కిస్తే ఎకరాకు సుమారు రూ.3.44 లక్షల వరకు పెట్టుబడి పెరిగింది. జిల్లాలో సగటు దిగుబడి 80 కౌంట్ అనుకుంటే ఏడాది కాలంలో వినియోగిస్తున్న మేతకు తాజాగా పెంచిన ధరల వల్ల రెండు జిల్లాల రైతులపై సుమారు రూ.230.76 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా.


