వెంకన్నను దర్శించిన అశేష భక్తజనం
ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. భక్తుల గోవింద నామ స్మరణలతో మాడవీధులు మార్మోగాయి. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావించారు. స్వామివారిని సుమారు 80 వేల నుంచి లక్ష మందికి పైగా భక్తులు శనివారం దర్శించుకున్నారని ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉపకమిషనర్ ఎన్.సూర్యచక్రధరరావు తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు వివిధ రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వాడపల్లికి విచ్చేసి గౌతమీ గోదావరి నదిలో స్నానాలు ఆచరించి, క్యూలైన్లో నిలబడి స్వామిని దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన సైతం స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. భక్తులు వేద ఆశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో వేంచేసివున్న క్షేత్రపాలకులు, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నేడు వకుళమాత
అన్నదాన భవనం ప్రారంభం
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో భక్తుల విరాళాలు రూ.6.25 కోట్లతో చేపట్టిన వకుళమాత శాశ్వత అన్నదాన భవనాన్ని ఆదివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు తాత్కాలిక వసతి భవనంలో అన్న ప్రసాదం స్వీకరించడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భవన నిర్మాణం ఆవశ్యకతపై సాక్షి పత్రికలో వార్తలు ప్రచురితమయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సుమారు కోటిన్నర విలువైన ఆధునిక వంట సామగ్రి అందిస్తున్నట్లు తెలిసింది. కాగా.. ఈ భవన నిర్మాణంపై భక్తులు ఎన్నెన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బినామీ పేరుతో కాంట్రాక్టులు చేసి నిధులు కాజేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.


