అమలాపురం రూరల్: కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళను మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్(ఎంఎంసీ) సమన్వయంతో సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకకు చెందిన పెట్టా అనంతలక్ష్మి కువైట్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. భర్త ఎంఎంసీ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం, ఎంఎంసీ కలసి ఆమెను సురక్షితంగా కోనసీమకు తీసుకువచ్చారు. అనంతలక్ష్మి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2025 నవంబర్లో సత్యనారాయణ అనే ఏజెంట్ ద్వారా ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఒక కుటుంబంలో గృహ కార్మికురాలిగా పనికి కుదిరింది. అక్కడ తీవ్రమైన పని ఒత్తిడితోనే 8 నెలలు చేసింది. ఎంత కష్టపడి పనిచేసినా యజమాని భార్య తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేదని ఆమె తెలిపింది. ఆమె భర్త కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను సురక్షితంగా కోనసీమ రప్పించినట్లు ఎంఎంసీ నోడల్ అధికారి వి.సుబ్బారావు, సమన్వయకర్త గోళ్ళ రమేష్ తెలిపారు. పెట్టా అనంతలక్ష్మి తన భర్తతో కలిసి జేసీ వైకోమ్ నైడియాదేవిని కలిసి తమకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం, ఎంఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కడియాల సత్తిబాబు పాల్గొన్నారు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారు 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడని రాజమహేంద్రవం జీఆర్పీ స్టేషన్ ఎస్ఐ సతీష్ మంగళవారం తెలిపారు. అతడి ఎత్తు దాదాపు 5.2 అడుగులు ఉంటుందని, ఒంటిపై ఆకుపచ్చ రంగు లుంగీ ఉందన్నారు. మరే ఇతర ఆధారాలు లభ్యం కాలేదని, ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్ 94948 19898, 0883 244282కు సమాచారం ఇవ్వాలని కోరారు.
నేడు పోలీసు కస్టడీకి
ప్రియాంక కేసు నిందితులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కారుతో ఢీకొట్టి డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోసఫ్ ఎడ్వర్డ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.


