పెరవలి: ముక్కామలలోని బాపన్న కాలువలో స్నానం చేస్తున్న వ్యవసాయ కూలీ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన ఏడిద రవితేజ (41) మరికొందరితో కలిసి వ్యవసాయ పనుల కోసం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ముగ్గురు కాలువలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోబోయారు. గమనించిన స్థానికుడు వెంటనే కాలువలోకి దూకి ఇద్దరికి కాపాడాడు. కానీ రవితేజ మాత్రం నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు స్థానిక గజ ఈతగాళ్లతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తహసీల్దార్ కె.నిరంజన్ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితి పరిశీలించారు. కాలువలో గాలింపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కావాలని ఉన్నతాధికారులను కోరారు. వారు వచ్చిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని ఆయన తెలిపారు.


