తాళ్లరేవు: ప్రముఖ పర్యాటక ప్రాంతం కోరింగ అభయారణ్యాన్ని కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్లో శిక్షణ పొందుతున్న సుమారు 350 పోలీస్ ట్రైనీస్ ఆదివారం సందర్శించారు. స్టడీ టూర్లో భాగంగా అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు ఆధ్వర్యంలో కోరింగ ఎకో టూరిజానికి సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మడ అడవుల ప్రయోజనాలు, ఎకో టూరిజం ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాన్ని మడ అడవులు ఏ విధంగా కాపాడుతున్నాయనే అంశాలను అటవీ సిబ్బంది తెలిపారు. సెక్షన్ అధికారి కె.సిద్ధార్థ, ఎఫ్బీఓలు గోపి నాగేంద్రకుమార్, ఽకె.మహేష్, కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.


