శాంతిభద్రతలు విఫలమయ్యాయి
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
అల్లవరం: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్గిగా విఫలమయ్యామని ఎమ్మెల్సీ ఇ జ్రాయిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, వారి ఇళ్లపై దాడు చేయడం, నివాసాలకు నిప్పు పెట్టడం చూస్తుంటే రాష్ట్రాన్ని చంద్రబాబు రావణకాష్టంగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. విడదల రజిని, అంబటి రాంబాబు, జోగి రమేష్లపై విచక్షణా రహితంగా కూటమి నాయకులే దాడులు చేసి నిప్పు పెట్టడం చూస్టుంటే ప్రజల, మాన ప్రాణాలకు రక్షణ ఏదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై దౌర్జన్యాలు చేయడం దుర్మార్గమని తెలిపారు. అంబటి ఇంటిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసిన వారిని వదిలేసి రాంబాబుని అరెస్టు చేయడం అన్యాయమని తెలిపారు. తక్షణమే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన కోరారు.
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ను సోమవారం ఉదయం పది గంటల నుంచి కలెక్టరేట్ గోదావరి భవన్లో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ మహేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు, మూడు రెవెన్యూ డివిజినల్ అధికారుల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
గోదావరి డెల్టాకు
సీలేరు జలాలు
మోతుగూడెం: గోదావరి డెల్టాకు లోయర్ సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు సుమారు 8 వేల క్యూసెక్కుల వరకూ నీటి అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలపడంతో, నీటి విడుదలకు ఏపీ జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి 28 రోజుల పాటు గోదావరి జిల్లాలకు రబీ అవసరాల నిమిత్తం జలాలు విడుదల చేయనున్నారు. డొంకరాయి డ్యామ్ నుంచి 3,800 క్యూసెక్కులు, పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం 4,200 క్యూసెక్కులు కలిపి మొత్తం 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. సుమారు రెండు నెలలు ఐదారు యూనిట్ల అనుసంధాన పనుల వల్ల నీటి విడుదల ఆలస్యం అయ్యిందని అధికారులు తెలిపారు. డొంకరాయి డ్యామ్ నుంచి దిగువలకు నీటిని విడుదల చేయడంతో సీలేరు నది ప్రవాహ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జెన్కో అధికారులు సూచించారు. ఈ సమాచారాన్ని చింతూరు ఐటీడీఏ, రెవెన్యూ శాఖకు తెలిపామన్నారు.
శాంతిభద్రతలు విఫలమయ్యాయి


