
7న వాడపల్లి ఆలయం మూసివేత
కొత్తపేట: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్టు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ ఆదివారం రాత్రి 9.55 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు చంద్రగ్రహణం సంభవిస్తుందని పేర్కొన్నారు. గ్రహణ సమయానికి ముందుగానే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం 7.01 గంటలకు ఆలయాన్ని తెరిచి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపారు.
64 మంది గురువులకు
జిల్లా ఉత్తమ పురస్కారాలు
నేడు కలెక్టరేట్ ఆవరణలో ప్రదానం
రాయవరం: గురు స్థానానికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబరు 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 64 మంది ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారాలు సాధించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ ఆవరణలోని గోదావరి భవన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఈ మేరకు గురుపూజోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలో తమదైన శైలిని కనబర్చిన వివిధ క్యాడర్లకు చెందిన 64 మంది ఉపాధ్యాయులకు ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు డీఈఓ డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు.
తగ్గినట్టే తగ్గి.. పెరిగిన వరద
ఐ.పోలవరం/పి.గన్నవరం: గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతోంది. బుధవారం రాత్రి వరకు తగ్గుతున్న వరద తరువాత పెరిగింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో 8,25,573 క్యూసెక్కుల వరద నీటిని దిగువునకు విడుదల చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి నీటి విడుదల 9,11,254 క్యూసెక్కులకు పెరిగింది. తరువాత కూడా వరద పెరుగుతూనే ఉంది. జిల్లాలోని లంక గ్రామాల్లో వరద నెమ్మదిగా తగ్గుతోంది. కాజ్వేలను, రోడ్లను వరద వీడింది. దీనితో పడవల మీద ప్రయాణాలు చాలా వరకు నిలిపివేశారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబియం కాజ్వేల మీద వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.

7న వాడపల్లి ఆలయం మూసివేత