
తాళం వేసిన ఇంట్లో చోరీ
రాజోలు: ఇంట్లో వారు ఊరు వెళ్లారని తెలుసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ములికిపల్లిలోని ఓ ఇంటిని గుల్ల చేశారు. ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలోని రూ.ఐదు లక్షలు, ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. రాజోలు సీఐ నరేష్కుమార్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 7న ఇంటి యజమాని కట్టా వెంకటలక్ష్మి తమ బంధువుల ఇల్లు ఏలూరుకు వెళ్లారు. 8వ తేదీ ఉదయం పని మనిషి ఇంటి వాకిలి శుభ్రం చేసేందుకు రాగా, ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వెంటనే ఆ సమాచారాన్ని వెంకటలక్ష్మికి ఫోన్లో తెలిపింది. ఏలూరు నుంచి వెంకటలక్ష్మి వచ్చి చూసేసరికి ఇంట్లోని బీరువాను పగలకొట్టి, అందులో ఉన్న రూ.ఐదు లక్షలు, ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాజోలు సీఐ నరేష్కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది.