ఫోర్‌ కొట్టిన కోనసీమ | - | Sakshi
Sakshi News home page

ఫోర్‌ కొట్టిన కోనసీమ

Apr 23 2024 8:10 AM | Updated on Apr 23 2024 8:10 AM

22ఎండీపీ121:

పది ఫలితాల్లో జిల్లాకు 4వ స్థానం

గతేడాది కంటే తొమ్మిది స్థానాలు

ముందుకు

సత్తా చాటిన సర్కారీ స్కూల్స్‌

ఈ ఏడాదీ బాలికలదే పైచేయి

జిల్లా వ్యాప్తంగా 14,459 మందికి ప్రథమ శ్రేణి

రాయవరం/ముమ్మిడివరం: పదవ తరగతి ఫలితాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా విద్యార్థులు 91.88 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. గతేడాది జిల్లా పది ఫలితాల్లో 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది తొమ్మిది స్థానాలు ముందుకు వెళ్లి నాల్గవ స్థానంలో నిలిచింది. అదేవిధంగా జోన్‌–2 పరిధిలో గతేడాది పది ఫలితాల్లో 2వ స్థానంలో నిలువగా ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలువడం గమనార్హం. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు.

ఈసారీ బాలికలదే పైచేయి

పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. 9,471 మంది బాలురు, 9,316 మంది బాలికలు కలిపి 18,787 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 8,551 (90.29 శాతం), బాలికలు 8,711 (93.51 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 18,787 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 17,262 మంది ఉత్తీర్ణత (91.88శాతం) సాధించారు.

పటిష్టమైన ప్రణాళికతో..

పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికా బద్ధంగా చేసిన కృషి కారణంగా చెప్పవచ్చు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి పాఠశాలల పునఃప్రారంభం నుంచి పదవ తరగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత విద్యా సంవత్సరంలో జూలై నుంచే ఉదయం, సాయంత్రం పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులపై పాఠశాలల హెచ్‌ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా పర్యవేక్షణ చేశారు. 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు చేపట్టారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంల నుంచి ఆర్‌జేడీ స్థాయి వరకు పదవ తరగతిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. నవంబర్‌ నెలాఖరుకు సిలబస్‌ పూర్తి చేసి, ప్రతి రోజూ రివిజన్‌ చేపట్టారు. జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు 70 రివిజన్‌ టెస్టులు తయారు చేసి విద్యార్థులకు తర్ఫీదునిచ్చారు. సబ్జెక్టు నిపుణులతో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒక మార్కు ప్రశ్నలు ఆడియో క్లిప్పింగ్స్‌ రూపంలో తయారు చేసి, ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. జిల్లా పరిషత్‌ యాజమాన్యం కూడా విద్యాభారతి పేరుతో స్టడీ మెటీరియల్‌ సరఫరా చేసింది. ఇటువంటి చర్యలన్నీ మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేసినట్లుగా పలువురు హెచ్‌ఎంలు చెబుతున్నారు.

153 పాఠశాలల్లో శత శాతం ఫలితాలు

జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో 153 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 47 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌, మున్సిపల్‌, బీసీ, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ యాజమాన్యాలకు చెందిన ఏడు పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధిస్తే, జెడ్పీ యాజమాన్య పరిధిలో 40 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రైవేట్‌ యాజమాన్య పరిధిలోని 106 పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఫలితాలు ఇలా..

జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పది పరీక్షలు రాసిన 242 మంది విద్యార్థులకు 215 మంది ఉత్తీర్ణత(88.84శాతం) సాధించారు. వీరిలో 110 మంది బాలురకు 97 మంది, 132 మంది బాలికలకు 118 మంది ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆశించిన మేర ఫలితాలు వచ్చినట్లు డిప్యూటీ డైరెక్టరు పి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు.

బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు

జిల్లాలో తొమ్మిది బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా, ఐదు వసతి గృహాల్లో 10వ తరగతి విద్యార్థులు 31 మంది పరీక్షలకు హాజరయ్యారు. 27 మంది ఉత్తీర్ణులు కాగా, 22 మంది ప్రథమ శ్రేణి, నలుగురు ద్వితీయ శ్రేణి, ఒక విద్యార్థి తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు జిల్లా బీసీ సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారి యడ్లపల్లి సాంబమూర్తి తెలిపారు.

డీఈవో కమలకుమారిని అభినందిస్తున్న విద్యాశాఖ అధికారులు, సిబ్బంది

కార్పొరేటుకు దీటుగా

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించి, జిల్లాకే గర్వకారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిలువడం గమనార్హం. మండలాల వారీగా చూస్తే ముమ్మిడివరం మండలం 98.72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, 97.84 శాతం ఉత్తీర్ణతతో ఐ.పోలవరం మండలం రెండోస్థానం, 97.70 శాతం ఉత్తీర్ణతతో మలికిపురం మండలం తృతీయ స్థానంలో నిలిచాయి. 83.58 శాతం ఉత్తీర్ణతతో కొత్తపేట మండలం చివరి స్థానంలో నిలిచింది.

పరీక్షకు హాజరైన విద్యార్థులు 18,787

ఉత్తీర్ణులైన వారు 17,262

ఉత్తీర్ణులైన బాలురు 8,551

ఉత్తీర్ణులైన బాలికలు 8,711

ప్రథమ శ్రేణి 14,459

ద్వితీయ శ్రేణి 1,970

తృతీయ శ్రేణి 833

590కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

విద్యార్థి పేరు పాఠశాల మండలం పొందిన

మార్కులు

పినపోతు ఈషిత జెడ్పీహెచ్‌ఎస్‌,ఓడలరేవు అల్లవరం 595

నూకపెయ్యి నవనీత్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, చప్పిడివారిపాలెం కొత్తపేట 593

అక్కల బిందు శరణ్య జెడ్పీహెచ్‌ఎస్‌, గొల్లవిల్లి ఉప్పలగుప్తం 592

మల్లేశ్వరపు శిరీష జెడ్పీహెచ్‌ఎస్‌, ఏడిద మండపేట 591

బొంతు హర్షిత జెడ్పీహెచ్‌ఎస్‌,మొగలికుదురు మామిడికుదురు 590

అడబాల సూర్య జెడ్పీహెచ్‌ఎస్‌ మలికిపురం 590

నాగదేవి కీర్తన కేశనపల్లి

గిడుగు శ్రీరామదుర్గ జెడ్పీహెచ్‌ఎస్‌, పెదపట్నంలంక మామిడికుదురు 590

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement