మానసిక స్థితి సరిగా లేదని భూతవైద్యం.. ఆఖరికి యూపీలో

Vijayawada: Missing Women Assassinated By Man - Sakshi

సాక్షి, విజయవాడ: కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన యువతి శవమై తేలింది. ప్రేమ పేరిట నమ్మించి తనతో పాటు తీసుకువెళ్లిన యువకుడి చేతిలో హత్యకు గురైంది. వివరాలు.. స్థానిక చిట్టినగర్‌కు చెందిన ఫాతిమా(21) అనే యువతి ఈనెల 10 నుంచి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురి మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా ఫాతిమాకు మతిస్థిమితం లేకపోవడంతో చికిత్స కోసం ఆమె తండ్రి.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వాసిఫ్‌ను పిలిపించారు. అతడు ఫాతిమాకు భూతవైద్యం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్యం పేరుతో మరో స్నేహితుడు తయ్యబ్ సాయం సాయంతో వాసిఫ్‌ ఫాతిమాను ట్రాప్ చేశాడు. ఇందులో భాగంగా ఢిల్లీకి ఆమెకు టికెట్ తీయించగా..  ఫాతిమా ఒంటరిగానే అక్కడికి రైలు ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వాసిఫ్‌, తయ్యబ్‌, ఫాతిమా ముగ్గురూ కలిసి యూపీలోని సహరన్‌పూర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే... ఈనెల 10వ తేదీన ఫాతిమా కనిపించకపోవడంతో, అదేరోజు ఆమె తండ్రి కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

మరోవైపు... తన కుమార్తె ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు వెళ్లిందని తెలుసుకున్న ఫాతిమా తండ్రి.. తన స్నేహితులతో కలిసి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. అతడి ఆచూకీ కనుగొని.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లగా తానే యువతిని హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమెకు సంబంధించిన బంగారం కూడా తన వద్దే ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఫాతిమా హత్యకు గురైందన్న చేదు నిజం తెలియడంతో... అత్యాచారం చేసి చంపేసారా అన్న కోణంలో సహారన్పూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువతికి సంబంధించిన 15 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ కేసు విషయమై స్థానిక కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘటన జరిగిన రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతోందని, సదరు యువతికి సంబంధించిన మిస్సింగ్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీని అక్కడి పీఎస్‌కు మెయిల్‌ పెట్టినట్లు తెలిపారు. ఏదేమైనా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top