Two Brothers Died In a Road Accident in Elkathurthy Mandal of Hanamkonda District - Sakshi
Sakshi News home page

అన్న ప్రభుత్వ ఉద్యోగి, తమ్ముడు సాఫ్ట్‌వేర్‌.. ఊహించని రోడ్డు ప్రమాదంలో

May 22 2023 7:55 PM | Updated on May 23 2023 6:00 AM

Two Brother Died In Road Accident Hanamkonda - Sakshi

సాక్షి, హన్మకొడ: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని పొట్టన పెట్టుకుంది. హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణగా గుర్తించారు.

వివరాలు.. హుజూరాబాద్‌ కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25), చిన్న కుమారుడు హరికృష్ణ (23). శివరామకృష్ణ రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై మౌలాలీ (సికింద్రాబాద్‌)లో శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

కాగా ఇటీవల పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్‌ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం చెప్పడం కోసం ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మనోహర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు  స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement