Kidnapped Baby Case, Solved Within 10 Hours: కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం - Sakshi
Sakshi News home page

కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం

Aug 30 2021 5:12 AM | Updated on Aug 30 2021 9:07 AM

Kidnapped child case was solved by police within 10 hours - Sakshi

తల్లికి శిశువును అప్పగిస్తున్న ఎస్పీ

మార్కాపురం: ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన ఐదు రోజుల శిశువు కిడ్నాప్‌ కేసును పోలీసులు 10 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌ తెలిపారు. మార్కాపురం సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం ఆమె కేసు వివరాలను తెలిపారు. గుంటూరు జిల్లా్లకి చెందిన ఏ. శ్రీరాములుకు ప్రకాశం జిల్లాకి  చెందిన కోమలితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కోమలి మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఈ నెల 24న పాపకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు రావటంతో చికిత్స చేయిస్తుండగా 28న గుర్తు తెలియని మహిళ వైద్యశాల నుంచి శిశువును కిడ్నాప్‌ చేసింది.

శిశువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్‌ ఎస్‌ఐ కోటయ్య తన సిబ్బందితో కలిసి కంభం రోడ్డులో ఉన్న ఓ చిన్నపిల్లల వైద్యశాలకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ ఓ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తన పేరు దూదేకుల రేహానా అని, కంభం అర్బన్‌ కాలనీలో నివాసం ఉంటున్నానని తానే  శిశువును దొంగిలించినట్లు మహిళ తెలిపింది. తనకు దూరపు బంధువులైన కంభంలో నివాసం ఉండే హలీమా బేగం, రహమతున్నీసా బేగంలకు శిశువును విక్రయించేందుకు రూ.50 వేలకు అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. నిందితులైన రెహనా, హలీమా బేగం, రహంతున్నిసా బేగంలను అరెస్టు చేసి  పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement