అగ్నికీలల్లో ఆర్తనాదాలు

Five Live Burn in Bus Fire Accident Karnataka And 27 Injured - Sakshi

చిత్రదుర్గం జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధం  

ఐదుగురు సజీవ దహనం  27 మందికి గాయాలు

సాక్షి, బళ్లారి: బస్సు బెంగళూరుకు పరుగులు తీస్తోంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో బస్సులో అగ్నికీలలు. కొందరికి మెలకువ వచ్చి బస్సులో నుంచి దూకేశారు. డ్రైవర్‌ బస్సును నిలిపేసి పారిపోయాడు. డ్రైవర్‌ వెనుక సీట్లో ›కూర్చున్న బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కవిత(28), ఆమె అక్క శీలా (33), వారి ముగ్గురు పిల్లలు స్పర్శ (8), సమృద్ధి(5), నిశ్చిత(3)లు మంటల్లో చిక్కి సజీవ దహనమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా కేఆర్‌హళ్లి వద్ద జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున 3–4 సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విజయపుర(బీజాపూర్‌) నుంచి బెంగళూరుకు వెళ్తున్న కుక్కేశ్రీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంటల్లో చిక్కుకుంది. పై ఐదుగురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్రంగా గాయపడటంతో చిత్రదుర్గ, హిరియూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. 

కలెక్టర్, ఎస్పీ పరిశీలన  
ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్‌ కవిత, ఎస్పీ రాధికలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. డ్రైవర్‌ పరారు కావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిద్రలోకి జారుకొన్న వారు ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలుకాకపోగా ముగ్గురు చిన్నారులు కావడం వల్ల వారికి ఏం జరుగుతోందో తెలియక క్షణాల్లో కాలిబూడిదయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top