Another Student Died In Warangal Over Lover Cheating, Details Inside - Sakshi
Sakshi News home page

వరంగల్‌లో మరో దారుణం.. ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

Feb 27 2023 5:13 PM | Updated on Feb 27 2023 6:36 PM

Another Student Died In Warangal Over Lover Cheating - Sakshi

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌లో దారుణం వెలుగుచూసింది. మెడికల్‌ విద్యార్థి ప్రీతి, బీటెక్‌ స్టూడెంట్‌ రక్షిత సుసైడ్‌ ఘటనలు మరవక ముందే మరో యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రేమికుడు మోసం చేశాడన్న కారణంతో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది.

ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌కు చెందిన పోగుల ఉషారాణి అనే యువతి.. డిగ్రీ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఒకేషనల్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లికి చెందిన ప్రశాంత్‌ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారింది. అయితే  ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఉషారాణి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని హుజురాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఉషారాణి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు సీనియర్‌ వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య.. రాష్ట్రంలో ర్యాగింగ్‌ విష సంస్కృతికి నిరసనగా నేడు(సోమవారం) తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వైద్య విద్యార్థి మృతికి కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement