శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు

Actors Radikaa, Sarath Kumar sentenced to one year in jail - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్‌బౌన్స్‌ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు ఇలా.. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్‌ ఫ్రేమ్స్‌ సంస్థ ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్‌ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు.

ఆ డబ్బుతో  ‘పాంబు సట్టై’ అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్‌ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్‌ సంస్థ కోర్టులో పిటిషన్‌ వేసింది. డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్‌కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్‌ సంస్థకు అందజేశారు. శరత్‌కుమార్‌ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్‌ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్‌ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్‌ సంస్థ  చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్‌ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్‌ జారీచేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top