పల్లె గొంతు తడిసేనా..?
చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు జిల్లాలో గ్రామీణ కుటుంబాలు 3,74,.491 ఉన్నాయి. వాటిలో కొలాయి కనెక్షన్లు ఉన్న కుటుంబాలు 2,90,933. కొలాయి కనెక్షన్లు లేని కుటుంబాలు 83,558. వాటికి తాగునీటిని అందించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలకు సంబంధించి సీపీడబ్ల్యూఎస్ కింద 2, పీడబ్ల్యూఎస్ కింద 3,754, ఎంపీడబ్ల్యూఎస్ కింద 212 ఉన్నాయి. అలాగే 1,490 ప్రాంతాల్లో నీటిని నేరుగా పంపింగ్ చేస్తున్నారు. అలాగే చేతి పంపులు 6,161 ఉన్నాయి. గతంలో వేసవికి ముందే అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బిందెడు నీటి కోసం వ్యవసాయ బావులు, బోర్ల వద్దకు పరుగులు తీశారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితి రాకుండా చూడడానికి అధికారులు జిల్లాలో తాగునీటి పథకాలు, చేతి పంపుల పరిస్థితిని పరిశీలించి మరమ్మతులు చేపట్టేందుకు ‘క్రాస్’ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, మండల పరిషత్తు, పంచాయతీ అధికారులు సమన్వయంగా పనిచేయాలని పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటే చోట్ల చేతి పంపులకు అదనంగా రెండు పైపులు జోడించాలని, ఏటా మరమ్మతులకు రూ.లక్షలు వెచ్చిస్తున్నా సమస్య ఎందుకు వస్తోందో గమనించాలని సూచించారు.
జాగ్రత్తలు పాటించాలి
చేతి పంపులు మరమ్మతులకు గురైతే 48 గంటల్లో మండల పరిషత్తు నిధులతో పునరుద్ధరించాలి. గ్రామీణ నీటి సరఫరా పథకాలు మొరాయిస్తే పంచాయతీల నుంచి ఆర్థిక సంఘం నిధులు వెచ్చించుకోవచ్చు. ఇతర తాగునీటి పథకాలకు జెడ్పీ నిధులు సమకూర్చుతుంది. అవసరమైన స్పేర్పార్ట్లను సిద్ధం చేసుకోవాలి. అవసరమైన చోట థర్డ్ పార్టీతో సిబ్బందిని సిద్ధం చేసుకోవాలి.
వేసవి వచ్చిందంటే చాలు గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా జనం తాగునీటికి అల్లాడాల్సిందే. బిందెడు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఉన్న బోర్లు పనిచేయకపోవడం, తాగునీటి పథకాలు పడకేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి ఏటా ఈ సమస్య నెలకొంటున్నా అధికారుల్లో చలనం ఉండడం లేదు. ముందస్తుగా సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రజలను తాగునీటి ఇబ్బందుల నుంచి గట్టెకిక్కంచడం లేదు. ఈ ఏడాదైనా ఈ సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటారో లేదోనన్న భయం ప్రజల్లో అప్పుడే పట్టుకుంది.


