నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయం
కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివిధ శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సూచన
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, నిరక్షరాస్యత, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనలో యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈడీపీ శిక్షణ పూర్తి చేసిన మహిళా పారిశ్రామికవేత్తలకు పీఎంఈజీపీ యూనిట్లను అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) లోపు మంజూరు చేయాలన్నారు. మిగిలిన యూనిట్లను మార్చి 31 లోపు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. గండ్రాజుపల్లి, జీడీ నెల్లూరు, చిత్తూరు పారిశ్రామిక ప్రాంతాల్లో వీధి దీపాలు, డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో 65 వేల మందిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితంలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వారికి ఫిబ్రవరి చివరి వారంలో ప్రీ–ఫైనల్, మార్చి 29న ఎన్ఐవోఎస్ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశాల్లో పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఎల్డీఎం హరీష్ తదితరులు పాల్గొన్నారు.


