అనధికారిక చీటీలు ... ఐపీలు !
పలమనేరు : కొంత మంది పేదలు, మధ్య తరగతి వాసుల అవసరాలను ఆసరాగా చేసుకుని అనధికారికంగా చీటీలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఐపీ పెడుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా శనివారం పలమనేరు పట్టణం బజారు వీధికి చెందిన వెంకట్రావు అనే బంగారు వ్యాపారి రూ.14 కోట్లకు ఐపీ పెట్టాడు. అనధికారికంగా 400 మందికి రూ.90 కోట్ల వరకు మోసం చేసినట్టు సమాచారం. గతంలోనూ నలసానపల్లికి చెందిన దంపతులు, గంటావూరుకు చెందిన ఒక మహిళ, జీడుమాకులపల్లికి చెందిన మహిళ చీటీలు వేసి ఆపై ఐపీ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ నియోజకవర్గంలో ఇలాంటి అనధికారిక చీటీలు నడిపేవారు వందల్లో ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఐపీ పెడాతారోనన్న భయం డబ్బులు కట్టిన వారిని వెంటాడుతోంది.
పక్కా ప్లాన్తో మోసం
కొన్నాళ్లు ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న వారు, ప్రభుత్వ టీచర్లు, రియల్టర్లు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలో కాస్త పలుకుబడి ఉన్న వారు చీటీల వ్యాపారంలోకి దిగుతున్నారు. ముందుగా ఏజెంట్ చీటీలని, ఆపై నాన్ ఏజెంట్ చీటీలని చీటీలో పాట పాడిన వారికి టేబుల్ క్యాష్ ఇస్తూ నమ్మకాన్ని పొందుతారు. ఆపై చీటీ ఎత్తిన వారికి ఆ డబ్బు మావద్దే ఉంటే నూటికి రూ.3 వడ్డీ ఇస్తామంటూ నెలనెలా వడ్డీ ఇస్తున్నారు. మరికొందరు బంగారు దుకాణాలను నడుపుతూ భారీ మొత్తంలో నగలు కొనే వారికి వడ్డీ ఆశ చూపుతున్నారు. నగలు ఇంట్లో పెడితే ఏమీ రాదని, తమ వద్ద ఉంచితే వచ్చే వడ్డీని ప్రతినెలా చీటీలు కట్టుకుని డబ్బు సంపాదించుకోవచ్చని నమ్మిస్తున్నా రు. ఇలా పెద్ద మొత్తం అయిన తర్వాత ఐపీ పెడుతున్నారు. మరికొందరు ఆలయాలు, దేవుళ్ల పేరిట చీటీ లు నిర్వహించి భారీగా మోసాలు చేస్తున్నారు. నిర్వాహకులకు చిట్ఫండ్ రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేక, కోర్టులకు వెళ్లలేక బాధితులు లబోదిబోమంటున్నారు.
తాజాగా జరిగిన మోసం ఎలాగంటే...
బజారు వీధిలో బంగారు దుకాణాన్ని పెట్టుకున్న వెంకట్రావు గతంలో అక్షర తపస్మాన్ కార్యక్రమంలో వేమనపల్లిలో వలంటీర్గా పని చేసేవాడు. ఆపై పట్టణానికి చెందిన ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థలో రోజువారి కలెక్షన్లు చేసేవాడు. ఆపై కేవలం లక్షతో చిరు వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించి గత 20 ఏళ్లుగా చీటీల వ్యాపారంలోకి దిగాడు. ఎంతో నమ్మకంతో ఉంటూ చీటీలను నిర్వహిస్తూ వచ్చి గతఏడాదిగా పక్కా ప్లాన్తో జనాన్ని మోసం చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. ఇందులో భాగంగా తన ఆస్తిపాస్తులను ఇతరులకు విక్రయించి తనవద్ద కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేదని కోర్టుకు తెలిపినట్టు సమాచారం. తన బంగారు దుకాణంలో బంగారు కొన్న వాళ్ల బంగారాన్ని వెంకట్రావే తీసుకొని వాటిని ఇదే పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి రూ.కోట్లలో రుణాలు పొందిన విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటిదాకా 110 అనధికార చీటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇందులో నిర్వాహకులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయనేతలుండడం కొసమెరుపు.


