బుల్‌ బౌన్స్‌బ్యాక్‌ | Stock Market: Sensex Jumps 1089 Points and Nifty Ends Above 22500 | Sakshi
Sakshi News home page

బుల్‌ బౌన్స్‌బ్యాక్‌

Apr 9 2025 2:39 AM | Updated on Apr 9 2025 7:58 AM

Stock Market: Sensex Jumps 1089 Points and Nifty Ends Above 22500

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల దన్ను  

సెన్సెక్స్‌ 1,089 పాయింట్లు ప్లస్‌ 

22,500 స్థాయిపైకి నిఫ్టీ 

రూ.7.32 లక్షల కోట్లు పెరిగిన సంపద

ముంబై: ఆసియా, యూరప్‌ మార్కెట్ల ర్యాలీతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. దిగువ స్థాయిలో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 1,089 పాయింట్లు పెరిగి 74,227 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 374 పాయింట్లు బలపడి 22,536 వద్ద నిలిచింది. ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్‌సంకేతాలు ఇచ్చారు. ఆర్‌బీఐ ఈసారి మరో 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. 

డాలర్‌ బలహీనత, అమెరికా బాండ్లపై రాబడులు దిగివచ్చాయి ఇతర దేశాలతో పోల్చితే ప్రతీకార సుంకాల వల్ల భారత్‌ పై పడే ప్రభావం తక్కువేనని అంచనాలూ ఇన్వెస్టర్లకు  ఊరటనిచ్చాయి. ఉదయమే సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. అన్ని రంగాల షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,721 పాయింట్లు ఎగసి 74,859 వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు దూసుకెళ్లి 22,697 వద్ద గరిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ రెండు శాతం చొప్పున పెరిగాయి. 

ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.7.32 లక్షల కోట్లు పెరిగి రూ.396.57 లక్షల కోట్లు (4.62 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరింది. ఇన్వెస్టర్లు సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.  

సెన్సెక్స్‌ సూచీలో ఒక్క పవర్‌గ్రిడ్‌ తప్ప (0.19%) మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. రంగాల వారీగా సూచీల్లో అయిల్‌అండ్‌గ్యాస్‌ 2.58%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 2.38%, టెలికం 2.32%, ఇండ్రస్టియల్స్‌ 2.04%, ఇంధన 2.%, కన్జూమర్‌ డిస్క్రేషనరీ 2.02% లాభపడ్డాయి. టెక్, హెల్త్‌కేర్, ఐటీ రెండుశాతం చొప్పున పెరిగాయి.  

మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌లో భాగంగా అదానీ షేర్లు సైతం కోలుకున్నాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 11 షేర్లూ లాభపడ్డాయి. బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్‌ గ్యాస్‌ 3.27%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 3.23%, అంబుజా సిమెంట్స్‌ 2.53% లాభపడ్డాయి. ఏసీసీ 2.32%, అదానీ విల్మార్‌ 2.24%, అదానీ పోర్ట్స్‌ 1.72%, సంఘీ ఇండస్ట్రీస్‌ 1.62%, ఎన్‌డీటీవీ 1.06%, అదానీ పవర్‌ 0.54%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 0.30 శాతం చొప్పున పెరిగాయి. గ్రూప్‌లో సంస్థల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.12.18 లక్షల కోట్లుగా నమోదైంది.  

ప్రపంచ మార్కెట్లు రయ్‌
వాణిజ్య సుంకాల చర్చలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయనే ఆశలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. జపాన్‌ నికాయ్‌ 6%, చైనా షాంఘై 2%, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.50%, దక్షిణ కొరియా కోస్పీ అరశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్, ఫాన్స్‌ సీఏసీ, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ మూడుశాతం లాభపడ్డాయి. భారత వర్తమాన కాలం ప్రకారం రాత్రి 8:30 గంటలకు నాస్‌డాక్‌ మూడు శాతం లాభంతో 16,063 వద్ద, డోజోన్స్‌ రెండున్నర శాతం పెరిగి 38,895 వద్ద, ఎస్‌అండ్‌పీ 2.50% లాభంతో 5,192 వద్ద ట్రేడవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement