No More Fastags, MORTh May Have A New Toll Collecting System Soon - Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజా, ఫాస్టాగ్‌ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

Dec 13 2022 6:04 PM | Updated on Dec 13 2022 7:34 PM

No More Fastags, Morth May Have A New Toll Collecting System Soon - Sakshi

టోల్‌ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది.

టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలపై నంబర్ ప్లేట్‌లను గుర్తించేలా కెమెరా ఎయిడెడ్ టోల్ కలెక్షన్ సిస్టమ సాంకేతికతను ఉపయోగించనుంది. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలను అమర్చనుంది. 

నిరీక్షణ తప్పనుంది
మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ (ఎంఓఆర్‌టీహెచ్‌) శాఖ టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల కోసం వాహనాలు నిరీక్షించే సమయాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 

మరి ఫాస్టాగ్‌ 
ప్రస్తుతం, దేశం అంతటా దాదాపు 97 శాతం టోల్ వసూలు ఫాస్టాగ్‌ ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ ఎక్కువగా ఉందని, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఓఆర్‌టీహెచ్‌ తెలిపింది. ఈ ఏఎన్‌పీఆర్‌ కెమెరాలను సెటప్ చేయడం వల్ల  టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించవచ్చు’ అని సూచించింది.

ఏఎన్‌పీఆర్‌ ఎలా పనిచేస్తుంది?
కేంద్ర హైవే రవాణా శాఖ వివరాల ప్రకారం..దేశంలో జాతీయ ప్రధాన రహదారుల్లో ఉన్న టోల్‌ గెట్లను తొలగించి...వాటి స్థానంలో లేటెస్ట్‌ టెక్నాలజీ ఏఎన్‌పీఆర్‌ కెమెరాల్ని ఇన్‌ స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత వాహనం నంబర్ ప్లేట్‌ మీద నెంబర్‌ను చదివి, సదరు వాహన యజమాని లింక్ ఫోన్‌ నెంబర్‌కు లింక్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి టోల్‌కు చెల్లించాల్సిన అమౌంట్‌ను డిడక్ట్‌ చేస్తుంది. 

వాహనాల నంబర్ ప్లేట్‌ల ఫోటోను క్యాప్చర్ చేయడానికి సిస్టమ్ ఎంట్రీ,  ఎగ్జిట్ పాయింట్‌లను ఏఎన్‌పీఆర్‌ కెమెరాలతో సన్నద్ధం చేస్తుంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్‌ వరకు కెమెరా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా సిస్టమ్‌కు సిగ్నల్ ఇస్తుంది.

ఏఎన్‌పీఆర్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా?
ఏఎన్‌పీఆర్‌తో టోల్‌ గేట్ల వద్ద రద్దీని తగ్గిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ..దీనిపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఈ పద్దతిలో 2019 తర్వాత కేటాయించిన నెంబర్‌ ప్లేట్లను మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే, భారత ప్రభుత్వం  2019లో ప్రయాణీకుల వాహనాలకు ఓఈఎం (Original Manufacturer Number ) నెంబర్‌ను అమలు చేసింది. కెమెరాలు ఈ కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్‌లను మాత్రమే చదవగలవు.

దీంతో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్‌పీఆర్‌ ) కెమెరాలు నంబర్ ప్లేట్ తొమ్మిది అంకెల రిజిస్ట్రేషన్ నంబర్‌ను మించి ఉన్నప్పుడు చదవడం సవాలుగా మారనుంది.

దేశంలో చాలా మంది వాహన యజమానులు నంబర్ ప్లేట్‌పై పేర్లు రాస్తుంటారు. దీని వల్ల సదరు నెంబర్‌ ప్లేట్లను గుర్తించడం కష్టం 

నెంబరు ప్లేట్లు మురికిగా ఉంటే వాటిని గుర్తించలేం. అలాంటి వాహనాలకు టోల్ వసూలు చేయడం చాలా కష్టం. అలాగే, ఏఎన్‌పీఆర్‌ కింద టోల్‌ చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటేందుకు ప్రయత్నించే వాహన యజమానులకు జరిమానా విధించే నిబంధన లేదు.

Advertisement
 
Advertisement
Advertisement