ఆర్థిక గణాంకాలు.. క్రూడ్‌ ధరలపై ఫోకస్‌ | Kevin Warsh speech to India Q1 GDP data | Sakshi
Sakshi News home page

ఆర్థిక గణాంకాలు.. క్రూడ్‌ ధరలపై ఫోకస్‌

Aug 31 2026 4:22 AM | Updated on Aug 31 2026 4:22 AM

Kevin Warsh speech to India Q1 GDP data

నేడు క్యూ1 జీడీపీ, రేపు ఆటో సేల్స్‌ డేటా విడుదల  

ఫెడ్‌ కఠిన పాలసీ అమలు సంకేతాలపై గ్లోబల్‌ మార్కెట్ల దృష్టి  

హార్మూజ్‌ పరిణామాలు, చమురు ధరల కదలికలపై కన్ను  

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై నిపుణుల అంచనాలు  

ముంబై: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ ముడిచమురు (క్రూడాయిల్‌) ధరల కదలికలు ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి. జాక్సన్‌ హోల్‌ సదస్సులో యూఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ కెవిన్‌ వార్ష్ చేసిన ‘కఠిన ద్రవ్య విధాన’ వ్యాఖ్యల నేపథ్యంలో.. వడ్డీ రేట్లపై ఫెడరల్‌ రిజర్వ్‌ భవిష్యత్‌ వైఖరి (అవుట్‌లుక్‌) జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను శాసించనుంది.

దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) నిధుల రాకపోకలపై నిఘా ఉంచాల్సి ఉంది. రంగాల వారీగా పరిశీలిస్తే ‘ఎన్విడియా అద్భుత ఆర్థిక ఫలితాలు, ఆశాజనకమైన గైడెన్స్‌తో గ్లోబల్‌ ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగానికి ఊపురావడం భారత ఐటీ షేర్లకు కలిసొచ్చే అంశం. కమోడిటీల ధరలు స్థిరపడటంతో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొనే అవకాశముంది. అయితే, క్రూడాయిల్‌ ధరలు తగ్గడం చమురు ఉత్పత్తి సంస్థల షేర్లపై ఒత్తిడి పెంచవచ్చు. ఉత్పత్తి, ముడిసరుకుల వ్యయాల పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు కూడా నష్టాల బాట పట్టొచ్చు. 

స్థూల ఆర్థిక గణాంకాల దృష్టి  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసిక (క్యూ1) జీడీపీ గణాంకాలు నేడు (ఆగస్టు 31, సోమవారం) విడుదల కానున్నాయి. భారత ఆర్థిక వృద్ధి రేటు, రికవరీ వేగాన్ని అంచనా వేసేందుకు ఇవి అత్యంత కీలకం. రేపు (సెప్టెంబర్‌ 1, మంగవారం) ఆగస్టు నెలకు సంబంధించిన ఆటో విక్రయాలు, తయారీ రంగ పీఎమ్‌ఐ కార్యకలాపాలు, జీఎస్‌టీ వసూళ్ల డేటా వెలువడనుంది. అదే రోజు రాత్రి అమెరికా తయారీ రంగ ఐఎస్‌ఎమ్‌ గణాంకాలు వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ 3న (గురువారం) భారతీయ సేవల రంగ పీఎమ్‌ఐతో పాటు యూఎస్‌ ప్రైవేటురంగ ఉపాధి కల్పన (ఏడీపీ) డేటా రానుంది. ఇక వారాంతంలో (సెప్టెంబర్ 4, శుక్రవారం) ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వల సమాచారంతో పాటు, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే ‘అమెరికా నాన్‌–ఫామ్‌ పేరోల్స్, నిరుద్యోగిత రేటు’ గణాంకాలు వెలువడనున్నాయి. 

చమురు పతనం.. భారత్‌కు లబ్ధి 
హార్మూజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా పాక్షికంగా పునఃప్రారంభం కావడంతో గత వారం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 5% క్షీణించి 89.31 డాలర్లకు దిగొచ్చింది. రవాణా మరింత వేగవంతమైతే చమురు ధరలు తగ్గి భారత్‌ వంటి దిగుమతి దేశాలకు లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ మళ్లీ సరఫరా అడ్డంకులు ఎదురైతే మార్కెట్లపై ఒత్తిడి తప్పదు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఆశించిన స్థాయిలో కఠినంగా లేకపోవడంతో చమురు ధరలు పడిపోయి, దిగుమతి ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. క్రూడ్‌ తగ్గడం, తద్వారా రూపాయి బలోపేతం కావడం మన మార్కెట్లకు సానుకూల అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు.

నిఫ్టీ టెక్నికల్‌ అవుట్‌లుక్‌
నిఫ్టీ ప్రస్తుతం పరిమిత శ్రేణిలో కన్సాలిడేషన్‌ అవుతోందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. టెక్నికల్‌ అంశాలు బలంగా ఉన్నాయంటున్నారు. వీక్లీ టైమ్‌ఫ్రేమ్‌లో సూచీకి సానుకూల ధోరణి ఉన్నప్పటికీ, ఎగువ స్థాయిల వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. వారాంతంలో షార్ట్‌ కవరింగ్‌ జరగడంతో నిఫ్టీ 24,176 వద్ద ముగిసింది. ఈ సానుకూలత కొనసాగితే ఎగువ స్థాయిలో తక్షణ నిరోధం 24,200 – 24,300 శ్రేణిలో ఉంది. ఈ శ్రేణిని ఛేదించగలిగితే సూచీ 24,500 దాటి 24,710 స్థాయి వరకు ర్యాలీ సాగించవచ్చు. ఒకవేళ స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించక అమ్మకాలు నెలకొంటే... దిగువ స్థాయిలో 24,000 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే అమ్మకాల తీవ్రత పెరిగి సూచీ 23,600 స్థాయికి దిగొచ్చే ప్రమాదం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement