ఈ మధ్యకాలంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక ఉద్యోగ అభ్యర్థికి వచ్చిన రిజెక్షన్ మెయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా కంపెనీలు అభ్యర్థిని తిరస్కరించేటప్పుడు.. క్వాలిఫికేషన్, స్కిల్స్ వంటివి చూస్తాయి. తమకు అవసరమైన స్కిల్ ఉన్నవారిని ఎంపిక చేసుకుంటాయి. లేకుంటే రిజెక్ట్ చేస్తాయి. కానీ.. అభ్యర్థి పనిచేసిన పాత ఆఫీస్ 600 మీటర్ల దూరంలో ఉండటం వల్ల రిజెక్ట్ చేస్తున్నట్లు కంపెనీ మెయిల్ ద్వారా వెల్లడించింది.

కంపెనీకి సంబంధించిన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కారణం చదివిన తరువాత చాలా మంది ఆశ్చర్యపోయారు. సాధారణంగా కంపెనీలలో గోప్యత అనేది ఉద్యోగి బాధ్యత. కాబట్టి దీనికి కొన్ని సెక్యూరిటీ పాలసీలు ఉంటాయి. కానీ.. కేవలం భౌగోళిక దూరం ఆధారంగా ఉద్యోగిని తిరస్కరించడం అనేది చాలా మందికి అర్థం కాని విషయం అయ్యింది.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయిన తరువాత, చాలామంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఇది పాతకాలపు ఆలోచన అని విమర్శించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచారం ఎప్పుడైనా, ఎక్కడైనా చేరవచ్చు. కాబట్టి, కేవలం ఆఫీసుల మధ్య దూరం ఆధారంగా గోప్యత భంగం కలుగుతుందని భావించడం సరైనది కాదని అన్నారు.


