సంస్కరణల అమలు పెద్ద సమస్య

India high growth path not foreordaine reforms - Sakshi

వార్‌బర్గ్‌ పింకస్‌ సీఈవో చార్లెస్‌

ముంబై: సంస్కరణల అమలు భారత్‌కు ప్రధాన సవాల్‌ అని అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌ సీఈవో చార్లెస్‌ కేయ్‌ తెలిపారు. సహజంగా అవకాశాలతోపాటే సవాళ్లూ ఉన్నాయని చెప్పారు. వ్యవసాయం, కార్మికులకు సంబంధించి భారత్‌ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బుధవారం జరిగిన గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘అధిక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు భారత్‌కు జనాభా వంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు జనాభా ఒక్కటే సరిపోదు.

ఈ స్థాయి వృద్ధికి నిరంతర చర్యలు, నిఘా ఉండాలి. 1995లో భారత్‌లో తొలిసారిగా హెచ్‌డీఎఫ్‌సీలో పెట్టుబడి చేశాం. నాటి నుంచి పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. అయితే సంస్కరణల అమలే సవాల్‌. సవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి భారత్‌కు బహిరంగ ప్రశ్నలు. ప్రస్తుత మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఆహ్వానించదగ్గది. ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ దేశీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను బ్యాంకింగ్‌ రంగానికి వదిలేశారు. ఆర్‌బీఐ, మారటోరియం ద్వారా వ్యవస్థకు మద్ధతు ఇచ్చారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి’ అని అన్నారు. ‘‘లాక్‌డౌన్‌ ముందుగానే విధించడం వల్ల ఆరోగ్య రంగం బలపడింది. దీంతో కేసులు పెరుగుతున్నా ఈ రంగం నిలబడింది’’ అని ఆయన విశ్లేషించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top