ధర దడ.. 3 నెలల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం | India CPI inflation rises to 1. 33percent in December | Sakshi
Sakshi News home page

ధర దడ.. 3 నెలల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Jan 13 2026 5:09 AM | Updated on Jan 13 2026 7:43 AM

India CPI inflation rises to 1. 33percent in December

న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో 2025 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 1.33 శాతం పెరిగింది. మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గతేడాది నవంబర్‌లో 0.71 శాతంగా, 2024 డిసెంబర్‌లో 5.22 శాతంగా నమోదైంది. తాజాగా ఇది పెరిగినప్పటికీ వరుసగా నాలుగో నెలలోనూ, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించుకున్న కనిష్ట పరిమితి రెండు శాతం లోపే ఉండటం గమనార్హం. 

వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం–చేపలు, గుడ్లు, మసాలా దినుసులు, పప్పులు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం, రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగినట్లు సీపీఐ డేటాను విడుదల చేసిన సందర్భంగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో (0.76 శాతం) పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అధికంగా 2.03 శాతం స్థాయిలో నమోదైంది. ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదైన టాప్‌ అయిదు పెద్ద రాష్ట్రాల్లో కేరళ (9.49 శాతం), కర్ణాటక (2.99 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (2.71 శాతం) ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేసే బాధ్యతను రిజర్వ్‌ బ్యాంక్‌కి కేంద్రం అప్పగించిన సంగతి తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement