హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన తెలుపుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులు
వెల్దండ గురుకులం బాలికల నిరసన
వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలల్లో భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు బుధవారం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారం రోజులుగా భోజనం సక్రమంగా అందించడం లేదని, మెనూ పాటించడం లేదని ఆరోపించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే తమనే బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. భయాందోళనకు గురిచేస్తున్న ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. రాస్తారోకోతో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఎస్సై కురుమూర్తి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పారు. అనంతరం గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలకు వెళ్లి అక్కడి వసతులను పరిశీలించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ స్వర్ణరత్నం మాట్లాడుతూ రెండ్రోజులుగా బియ్యం బాగాలేకపోవడంతో అన్నం మెత్తగా అయినట్లు వివరించారు.
కాగా, పాఠశాలల్లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెçపుతున్నారు. తహసీల్దార్ కార్తీక్కుమార్ పాఠశాలకు నాణ్యమైన బియ్యం అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తరగతి గదులకు వెళ్లారు. ప్రిన్సిపల్ను ఇతర ప్రాంతానికి బదిలీ చేస్తామని విద్యార్థులకు అధికారులు హామీఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మహ్మద్ అలీ, ఆర్ఐ శంకర్ తదితరులున్నారు.


