మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆస్తుల రక్షణ కోసం నిర్మించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను గత ప్రభుత్వంలోని పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కొల్లగొట్టిన చలాన్ల కుంభకోణంపై జరిగిన ఉన్నత స్థాయి విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
సచివాలయంలోని తన చాంబర్లో బుధవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్గాంధీ హనుమంతు, చలాన్ల కుంభకోణంపై నియమించిన కమిటీ సభ్యులు మంద మకరంద్, సింధుశర్మ, సంపత్, సుభాషిణి, శరత్కుమార్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా కమిటీ రూపొందించిన నివేదిక, ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొంగులేటి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణం కేవలం సాంకేతికపరమైన లోపమే కాదని, వ్యవస్థీకృత వైఫల్యమన్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మానవ ప్రమేయంతో తప్పులు చేసేలా ధరణి పోర్టల్ను రూపొందించారని ఆరోపించారు. భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదమైన భూముల సమాచారం లభించకుండా లాగిన్లు డిలీట్ చేశారని తెలిపారు. అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని, కోడ్ ఆడిట్ కూడా నిర్వహించలేదని ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైందని చెప్పారు.
తక్షణమే ధరణి పోర్టల్ లావాదేవీలపై కోడ్ఆడిట్ నిర్వహించాలని, భూభారతి పోర్టల్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆడిటింగ్లు పూర్తిచేసి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజల భూముల విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికి తీస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి పొంగులేటి ఆదేశించారు.


