ఐసీఐసీఐ, డీఎల్‌ఎఫ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జూమ్‌

ICICI Bank, DLF, Shriram transport zooms on Q2 results - Sakshi

క్యూ2 ఫలితాల ఎఫెక్ట్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ 7 శాతం హైజంప్‌

6 శాతం జంప్‌చేసిన డీఎల్‌ఎఫ్‌

9 శాతం దూసుకెళ్లిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ, రియల్టీ రంగ బ్లూచిప్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌, ఎన్‌బీఎఫ్‌సీ శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఐసీఐసీఐ బ్యాంక్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఆరు రెట్లు ఎగసి రూ. 4,251 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16 శాతం పెరిగి రూ. 9,366 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.64 శాతం నుంచి 3.57 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6.37 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.6 శాతం నుంచి 1 శాతానికి వెనకడుగు వేశాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 421 వద్ద ట్రేడవుతోంది.

డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. క్యూ2లో రూ. 236 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 72 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం మూడు రెట్లు పెరిగి రూ. 1,723 కోట్లకు చేరింది. ఇబిటా రూ. 100 కోట్ల నుంచి రూ. 576 కోట్లకు ఎగసింది. క్యూ2లో నికర అమ్మకాల బుకింగ్స్‌ రూ. 152 కోట్ల నుంచి రూ. 853 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డీఎల్‌ఎఫ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 167 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 171 వరకూ లాభపడింది.

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ రూ. 985 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం రూ. 2,022 కోట్లుగా నమోదైంది. ఇవి గతేడాది క్యూ2తో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ అంచనాలకంటే మెరుగైన ఫలితాలేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8 శాతం నుంచి 6.42 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 5.1 శాతం నుంచి 3.64 శాతానికి వెనకడుగు వేశాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 4.8 శాతం ఎగసి రూ. 1.13 ట్రిలియన్లను తాకాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 755 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 763 వరకూ దూసుకెళ్లింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top